Saturday, May 4, 2024

జ్ఞానము సర్వోత్కృష్ణ ఫలప్రదం

శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునునికి విజ్ఞాన సహిత మైన జ్ఞానమును ఏడో అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం గురించి చక్కని సందేశమందించినాడు. యుగయుగాలకు ఆదర్శ మిది. ఇందులో వాసు దేవతత్వం కూడా యిమిడి వున్నది. నా స్వరూపమును ‘ఏవమేవ భగవాన్‌’ అని తెలిసికొనుటకై భగవత్‌ స్వరూపమును తెలుపుచున్నానని ఈ క్రింది విధంగా ఒక శ్లోకం ద్వారా తెలుపుచూ-
శ్లో|| జ్ఞానం తేహం సవిజ్ఞానం- ఇదం వక్ష్యామ్యశేషత:
యజ్ఞాత్వానేహ భూ యోన్య: జ్ఞా తవ్యమవ శిష్యతే||
అంటూ ”అర్జునా! జ్ఞానమనగా శాస్త్రార్ధ పరిజ్ఞానము. ఆ జ్ఞానమును స్వానుభవమునకు తెచ్చుకొనుట విజ్ఞానము. అను భవమునకు రాని జ్ఞానముకంటే స్వానుభవ సిద్ధమైన జ్ఞానమునకే ప్రాధాన్యత విశేషంగా ఉంటుంది.
స్వానుభవయుక్తమై, విజ్ఞాన సహితమైన జ్ఞానమును నీకు ఈ అధ్యాయం ద్వారా ఉపదేశిస్తాను. ఏ జ్ఞానమును నీవు తెలుసు కొందువో, అజ్ఞానం కంటే వేరుగా, పురుషార్థ సాధకమైన జాతవ్యముండదని ఎవరు నా తత్వమును తెలిసి కొనెదరో అతడు సర్వజ్ఞుడగును.
”ఏక విజ్ఞానే నైవ సర్వ విజ్ఞానం భవతి” ప్రకారం ఏ ఒక్కదానిని సమగ్రముగా తెలిసికొన్నచో సర్వమూ విజ్ఞాతమగునో అది సమ్యగ్‌ దర్శనమని స్మృతియు వివరించినది. ఇంతటి విశిష్ట ఫలముగలది యగుటచే యా జ్ఞానము దుర్లభము. నా తత్వమును తెలిసికొను టయే ఈ జ్ఞానమునకు సర్వోత్కృష్ట ఫలము లభించినది. అదియే మోక్ష ప్రదం.
ఈ విశాల విశ్వంలో వేలకొలది జీవులుందురు. వారు లోక విషయాలలో ఆసక్త చిత్తులగుదురు. కానీ భగవత్‌ స్వరూపమును తెలిసికొనుటయే ఈ జ్ఞానమునకు సర్వోత్కృష్ట ఫలము లభించినది. అదియే మోక్ష ప్రదం.
ఈ విశాల విశ్వంలో వేల కొలది జీవులుందురు. వారు లోక విషయాల్లో ఆసక్త చిత్తులగుదరు. కానీ భగవతే స్వరూపమును తెలిసికొను టకు ప్రయత్నించరు. ఈ అసంఖ్యాక జీవుల్లో ఏ ఒకడో పురుషార్థ సిద్ధి కొరకు యత్నించుచున్నాడు. అట్టివారే సిద్ధులు.
అందుకే భగవానుడు ”మనుష్యాణాం సహస్రీషు- కశ్చిద్యదతి సిద్ధయే’యని గీతలో ఈ అధ్యాయంలో తెలిపినాడు. ఇది ఎల్లరు గ్రహించాల్సిన సత్యం అట్టి సిద్ధులలోనూ ఎవడో ఒకడే నా స్వరూప మును యథాతథముగ తెలిసికొనును. అది సచ్చిదానంద లక్షణ రూపమైన జ్ఞానము. పరమార్థ రూపమైన ఆత్మతత్వం. ఆ దశలో అలాంటి పుణ్యాత్ములకు పాప క్షయం కలుగుతుంది.
అర్జునా! పుణ్య కర్మలాచరించు సజ్జనులు నన్నారాధితురు అం టూ 16వ శ్లోకంలో ఇలా తెలిపారు.
శ్లో చతుర్విధా భజతేమాం – జనాస్సుకృతినోర్జున
ఆర్తో జిజ్ఞా సురర్థారీ- జ్ఞానీచ భరతర్షభ||
అనగా పుణ్యకర్మలాచరించు వారు నాలుగు విధాలుగా ఉంటారు.
1. ఆర్తులు : బాధల నుండి విముక్తిని బడయ గోరువారు.
2. అర్థార్థులు: ప్రాపంచిక సంబంధమగు ఐశ్వర్యము. అధికా రము- యశస్సు మొదలగునవి వాంఛించువారు.
3. జిజ్ఞాసువులు
జ్ఞానాసక్తి గలవారు. వీరే ముముక్షవులగు సాధకులు.
4. జ్ఞానులు: సాధన ముగిసి అపరోక్షానుభూతి గల జీవన్ముక్తులు.
ద్రౌపదియు, గజేంద్రుడు ఆర్త భక్తులుగా ఉన్నారని శ్రీకృష్ణ పర మాత్మ ఉదాహరణలు తెలిపాడు.
ఈ భక్తులందరిలోనూ జ్ఞానియే శ్రీకృష్ణుడు. అతడు నిష్కాముడై ఏకాగ్ర మనస్సుతో అనన్యభక్తి కలిగియుండును. జ్ఞానికి నా యందు పరమ ప్రీతి. అట్లే వానియందు నాకు ప్రేమ- అన్యోన్యత- నిష్కా మత అను లక్షణములచే జ్ఞానుల భక్తి ఉత్తమోత్తమమైనది. ఈ భక్తు లందరును శ్రేష్టులే. వారిలో జ్ఞాని సర్వోత్కృష్టుడు. ఈ జ్ఞాని దేహాత్మ బుద్ది వదిలి ఆత్మయందు తాదాత్మ్యము కలిగి జీవేశ్వరుల ఐక్యతను సిద్దింపజేసికొనును. కావున యిరువురము ఒకటిగానే యుండుట జరుగుచున్నది. అనేక జన్మల సాధన ఫలితముగా ఒకానొకనికి జ్ఞానోదయమగును. అదియే అతని చివరి జన్మ. దేహానంతరం అతడు నన్నే పొందును.
‘సర్వం ఖల్విదంబ్రహ్మ ఇదంతయూ బ్రహ్మమే’యని, జీవేశ్వ రుల జగత్తుల ఐక్యమును అనుభూత మొనర్చుకొనును. అట్టి వానికి అంతయు వాసుదేమమయమే. ”వాసు దేవస్సర్వమితి” అను భావ నలో జీవించును. లోకంలో ఈ స్థితిని సాధించిన మహాత్ములు చాలా అరుదు. వీరికి పూర్ణ జ్ఞానమే ఉన్నత లక్ష్యము. అనగా పరమే శ రారాధనలోనే జీవితమంతయు గడుపుచుండును.
జగద్కారణుడు పరమాత్మ. జ్ఞానులే సద సద్‌ వివేకము గల్గిన పుణ్యాత్ములు. వీరే బ్రహ్మ జ్ఞాన సంపన్నులు. అన్నీ ఈశ్వరాధీన ములే కదా! జ్ఞాని దృష్టిలో ధన పుత్రాదులకంటే ఆత్మయే పరమ ప్రేమాస్పదము. ప్రియతమము. జ్ఞాని ఆత్మ స్వరూపుడగుటచే నాకు అత్యంత ప్రియతముడు. అతనికి ఆత్మస్వరూపుడగుటచే నేను పరమ ప్రేమాస్పదుడను. ఇరువురం పరమ ప్రేమాస్పదులం.
పురుషుడు పెక్కు జన్మల తరువాత సర్వమూ వాసుదేవుడేయని జ్ఞానము కల్గినవాడై నన్ను పొందును.
ఉత్తమ సంస్కార రహిత జన్మలు జ్ఞాన సంస్కార జనన సమర్ధనములు కావు. ఆ యోగ్యత మానవ జన్మ కల్గిన పురుషునకే సిద్ధించును. కర్మ యోగియై, చిత్తశుద్ది కలిగి, బ్రహ్మ జిజ్ఞాస చేసి, జ్ఞానార్థమైన సంస్కారమును సంపాదించుకుని, ఈ జన్మయందా సంస్కార వశమున వేదాంత విచారమునందు ప్రవర్తించును. అట్టి జ్ఞాని అయిన పురుషునకు భగవత్‌ స్వరూప ప్రాప్తి కల్గుట ప్రధాన లక్ష్యము. శ్రీ కృష్ణ పరమాత్మ బోధించిన జ్ఞానమే సమ్యక్‌ జ్ఞానము. అదియే జ్ఞాని మహత్త్వము. పరమాత్మ సందే శం సకల జగతికి సదాచరణీయం. సదా స్మరణీయం.

– పివి సీతారామ మూర్తి
9490386015

Advertisement

తాజా వార్తలు

Advertisement