Thursday, May 9, 2024

Jagan’s Story – ‘నమస్తే బాబు.. నమస్తే అక్కయ్యా’ .. వైఎస్ఆర్ డైలాగ్స్ తో ‘యాత్ర 2’ మోష‌న్ పోస్ట‌ర్ ..

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ‘యాత్ర-2’ సినిమా మోషన్‌ పోస్టర్‌‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ పెద్ద చెయ్యి, చుట్టూ జనం.. అరచేతి పైకి జగన్ వెళ్తున్నట్టుగా యానిమేషన్ వీడియోను రూపొందించారు. ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్ చెప్పిన మాటలతో మోషన్‌ పోస్టర్‌ వీడియో ప్రారంభమైంది. ‘‘నమస్తే బాబు.. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే.. నమస్తే..” అంటూ వైఎస్ చెప్పిన మాటలను గుర్తు చేశారు.
‘‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్‌ రాజశేఖరరెడ్డి కొడుకుని’’ అనే డైలాగ్‌ని జగన్ పాత్రధారి చెప్పారు. ‘యాత్ర’ మొదటి భాగంలో వినిపించిన ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అనే డైలాగ్‌తో వీడియో ముగుస్తుంది. వైసీపీ ఆవిర్భావం, వైఎస్‌ జగన్‌ పాదయాత్ర, 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం కావడం వంటి అంశాలను యాత్ర 2 లో చూపించనున్నారు. ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ స్వరాలు సమకూర్చనున్నారు. జగన్‌ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ కానుంది.

YouTube video

పాఠ‌శాల‌, ఆనందోబ్ర‌హ్మ‌, యాత్ర వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌తోపాటు సేవ్ ది టైగ‌ర్స్‌, సైతాన్ వంటి వెబ్ సిరీస్‌ల‌తోనూ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ద‌ర్శ‌కుడు మ‌హి వి.రాఘ‌వ్‌. ఇప్పుడు ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా ‘యాత్ర 2’. 3 ఆట‌మ్ లీవ్స్, వి సెల్యులాయిడ్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను శివ మేక నిర్మిస్తున్నారు.

దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతి సంద‌ర్భంగా ‘యాత్ర 2’ మోషన్ పోస్టర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగానేడు జరిగిన పాత్రికేయుల‌తో జ‌రిగిన స‌మావేశంలో ద‌ర్శ‌కుడు మ‌హి వి.రాఘ‌వ్ మాట్లాడుతూ ‘‘కథను ఎంచుకునేటప్పుడు ఓ మేకర్‌గా కమర్షియల్ కోణంలో సినిమాకు పెట్టిన డబ్బులు వస్తాయా? లేదా? అన్నది ఆలోచిస్తాం. యాత్రలో ఓ రాజకీయ నాయకుడి తన గురించి తాను తెలుసుకోవడం, ప్రజల కష్టాలను తెలుసుకోవడం, ఆయన ఏంటన్నది ప్రజలు తెలుసుకోవడం ఉంటుంది. యాత్ర 2లో 2009 నుంచి 2019 వరకు జగన్ మోహన్ రెడ్డి పీరియడ్‌ను చూపిస్తాను. ఆయన ఎదుగుదలను పొలిటికల్ డ్రామాగా చూపిస్తాను. యథార్థ సంఘటనలే అయినా కూడా జనాలను ఆకట్టుకునేలా తెరకెక్కించేందుకు ఫిక్షన్ యాడ్ చేస్తాం. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టే కొడుకు అనే పాయింట్ చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. రెండు గంటల్లో కథను చెప్పాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేస్తాను.

- Advertisement -

ఆంధ్ర ఓటర్లను తక్కువగా అంచనా వేయొద్దు. ఈ సినిమాతో ఓటర్లు ప్రభావితం అవుతారని అనుకోవద్దు. సినిమా చూసి ఎమోషనల్ అవుతారు.. పోలింగ్ బూత్‌లో వాళ్లకు నచ్చిన వాళ్లకు ఓటు వేస్తారు. జగన్ ఎక్కడి నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టారు.. ఎక్కడి వరకు ఎదిగారు అన్నదే ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఈ నాలుగేళ్లలో రెండు వెబ్ సిరీస్‌లు, ఓ సినిమాను తీశాను. యాత్రకి, యాత్ర 2కి కథ పరంగా ఏ సంబంధం ఉండదు. జగన్ మోహన్ రెడ్డి జీవితంలో ఎత్తుపల్లాలున్నాయి. వాటినే సినిమాలో చూపిస్తాం. జగన్ అనే ఓ రాజకీయ నాయకుడి కథను చెప్పబోతోన్నాం. పొలిటికల్ సినిమాలు చేయడమే రిస్క్.. ఇలాంటి సినిమాలు ఎప్పుడు, ఏ టైంలో రిలీజ్ చేస్తామనేది ముఖ్యం. అందుకే ఎన్నికల టైంలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. మనం ఏది చెప్పినా కూడా నమ్మేవాళ్లు నమ్ముతారు నమ్మని వాళ్లు నమ్మరు. ఈ సినిమాను వైసీపీ వాళ్ల కోసమే తీస్తున్నామని అనుకోనివ్వండి. ఆర్జీవీ గారు తీసే వ్యూహం మాపై ఎలాంటి ప్రభావం చూపదు. త్వరలోనే నటీనటుల వివరాలను ప్రకటిస్తాం. శివ మేక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. మధి సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నామ’ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement