Wednesday, May 1, 2024

Revenue | కొత్త ఇంధన వ్యాపారం.. రిలయన్స్‌కు 15బిలియన్ల డాలర్ల ఆదాయం

ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2030 నాటికి కొత్త తరం ఇంధన వ్యాపారాల ద్వారా 10-15 బిలియన్‌ డాలర్ల ఆదాయం ఆర్జించే అవకాశం ఉందని ప్రముఖ నివేదిక అంచనా వేసింది. స్వచ్ఛ ఇంధన రంగం రిలయన్స్‌ వృద్ధికి ప్రధానంగా ఉంటుందని శాన్‌ఫోర్ట్‌ సి బెర్న్‌స్టెయిన్‌ నివేదిక తెలిపింది. శిలాజ ఇంధన వ్యాపారం నుంచి రిలయన్స్‌ క్రమంగా సౌర, హైడ్రోజన్‌ వంటి స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి వైపు మళ్లుతున్నది.

ఇప్పటికే ఈ దిశగా ప్రణాళికలు కూడా ప్రకటించింది. 2023 నాటికి 100 గిగావాట్‌ వ్యవస్థాగత సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌ లక్ష్యంగా నిర్ధేశించుకున్న 280 గిగావాట్‌ సామర్ధ్యంలో రిలయన్స్‌ వాటానే 35 శాతం ఉంది. 2030 నాటికి భారత్‌ మొత్తంగా 500 గిగావాట్‌ వ్యవస్థాగత స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో సౌర విద్యుత్‌ ఉత్పత్తిది అధిక వాటా. 2030 నాటకి భారత్‌ 65 గిగావాట్‌ సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

2030 నాటికి మన దేశంలో త్రీ వీలర్‌ వాహన విక్రయాల్లో 80 శాతం, వాణిజ్య వాహనాల్లో 70 శాతం, ప్రైవేట్‌ కార్లలో 30 శాతం విద్యుత్‌ వాహనాలే ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఛార్జింగ్‌ మౌలిక వసతులు లేకపోవడం, అందుబాటు ధరలో వాహనాలు లభించకపోవడం, బ్యాటరీ సరఫరా వ్యవస్థలు సరిగా లేకపోవడం వంటి కారణాల వల్ల మన దేశం నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం అలస్యమవుతుందని బెర్న్‌స్టెయిన్‌ నివేదిక అంచనా వేసింది. 2024-25 ఆర్ధిక సంవత్సరం నుంచి రిలయన్స్‌ కొత్త ఇంధన వ్యాపారం నుంచి ఆదాయాన్ని ఆర్జించడం మొదలు పెడుతుందని నివేదిక తెలపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement