Friday, May 17, 2024

విద్యుత్‌ వాహనాల పరిశ్రమలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు

మన దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల రంగం లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలకు అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం దేశ ఆటో మొబైల్‌ రంగంలో విద్యుత్‌ వాహనాలు అతి పెద్ద బిజినెస్‌గా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో వందల సంఖ్యలో కొత్త విద్యుత్‌ వాహనాలు మార్కెట్‌లోకి నున్నాయి. విద్యుత్‌ వాహనాల తయారీ, బ్యాటరీల తయారీ, ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు ఇలా అనేక రంగాల్లో పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ రంగానికి అవసరమైన నైపుణ్యం ఉన్న వారికి మంచి అవకాశాలు లభించనున్నాయని లింక్డెన్‌ ప్రకటించిన గ్లోబల్‌ గ్రీన్‌ స్కిల్స్‌ రిపోర్ట్‌ 2023లో పేర్కొంది. ఆటోమొటివ్‌ రంగంలో పని చేసే వర్కర్లకు గ్రీన్‌ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వడంలో మన దేశం ఇప్పటికే ముందుందని నివేదిక తెలిపింది. అమెరికా, మెక్సికో, కెనడా, పలు యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లో గత ఐదు సంవత్సరాలుగా విద్యుత్‌ వాహనాల తయారీలో శిక్షణ పొందిన కార్మికుల సంఖ్య 40 శాతానికి చేరుకుంది.

రానున్న రోజుల్లో విద్యుత్‌ వాహన రంగంలో గ్రీన్‌ స్కిల్స్‌ ఉన్న ఉద్యోగులకు డిమాండ్‌ భారీగా పెరుగుతుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ ఉద్యోగాలు వివిధ స్థాయిలో అవసరమవుతాయని పేర్కొంది. అందుకే ఈవీ రంగంలో రానున్న రోజుల్లో లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని పేర్కొంది.

- Advertisement -

2030 నాటికి ఈవీ రంగంలో 10 మిలియన్ల వరకు ప్రత్యక్ష ఉద్యోగాలు, మరో 50-55 మిలియన్ల వరకు పరోక్ష ఉద్యోగావకాశాలు వస్తాయని రాండ్‌స్టాండ్‌ ఇండియా, ప్రొఫెషనల్‌ సెర్చ్‌ అండ్‌ సెలక్షన్‌ డైరెక్టర్‌ సంజయ్‌ శెట్టి అభిప్రాయపడ్డారు. ఈవీ ఇండస్ట్రీకి తక్షణమే 5 మిలియన్ల నుంచి 10 మిలియన్ల ఉద్యోగులు అవసరమవుతారని హీరో ఎలక్ట్రిక్‌ ఏవీపీ హెచ్‌ మను శర్మ అభిప్రాయపడ్డారు.

ఓఈఎంతో పాటు కంపోనెంట్‌ తయారీ, సర్వీస్‌ రంగాల్లోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అవసరం అవుతారని చెప్పారు. 2030 నాటికి 20 మిలియన్ల కొత్త ఉద్యోగులు ఈవీ పరిశ్రమకు అవసరం అవుతారని రెవ్పిన్‌ వ్యవస్థాపక సీఈఓ సమీర్‌ అగర్వాల్‌ చెప్పారు. ఈవీలు, బ్యాటరీల రంగంలో పరిశోధన, తయారీ, ఛార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌, టె క్నికల్‌ నైపుణం ఇలా అనేక విభాగాల్లో నైపుణ్యం ఉన్న ఉద్యోగులు పెద్ద సం ఖ్యలో అవసరం అవుతారని చెప్పారు.

నైపుణ్యం ఉన్నవారి కొరత…

ప్రస్తుతం మన దేశంలోనూ విద్యుత్‌ వాహనాల రంగంలో వివిధ దశల్లో అవసరమైన నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. ఛార్జింగ్‌ స్టేషన్ల విషయంలో ఈవీ ఛార్జింగ్‌ ఇంజినీరింగ్‌, ఈవీ ఛార్జింగ్‌ ఆపరేషన్స్‌ రంగంలో నిపుణు కొరత చాలా ఎక్కువగా ఉందని ఛార్జింగ్‌ కంపెనీ ఎర్త్‌ట్రాన్‌ ఈవీ వ్యవస్థాపకుడు అశిష్‌ దేస్వాల్‌ చెప్పారు.

దీన్ని దృష్టిలో పెట్టుకునే టాటా మోటార్స్‌ తన సిబ్బందికి భారీ ఎత్తు ఈవీ వాహనాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇస్తోంది. ప్రస్తుతం పరిశ్రమకు అవసరమైన నైపుణ్యం ఉన్న వారికి ఇతర వాహనాల తయారీ రంగంలో పని చేసే వారి కంటే ఆర్‌ అండ్‌ డీ విభాగంలో పని చేసే వారికి 50 శాతం వరకు వేతనాలు అధికంగా చెల్లిస్తున్నారు. డేటా సైన్స్‌, అర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) నైపుణ్యాలు ఉన్న వారికి 40 నుంచి 50 శాతం వేతనాలు అధికంగా చెల్లిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement