Tuesday, April 30, 2024

టెక్‌ కంపెనీల్లో భారీగా తగ్గనున్నఉద్యోగ నియామకాలు

దేశంలో టాప్‌ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతిదారులుగా ఉన్న కంపెనీల్లో ఈ ఆర్ధిక సంవత్సరం ఉద్యోగ నియామకాలు భారీగా తగ్గనున్నాయి. ఇలాంటి కంపెనీల్లో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వంటి టాప్‌ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల్లోనే ఈ ఆర్ధిక సంవత్సరం కనీసం 50 వేల ఉద్యోగ నియామకాలు తగ్గుతాయని అంచనా వేశారు. ఈ కంపెనీలు గత సంవత్సరం 70 వేల మంది ఉద్యోగులును తీసుకున్నాయి.

2021-22 ఆర్ధిక సంవత్సరంలో కోవిడ్‌మ మూలంగా డిమాండ్‌ పెరగడంతో ఈ టెక్‌ కంపెనీలు 1,50,000 మందిని తీసుకున్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరంలో అంతర్జాతీయ పరిస్థితులు అత్యంత ప్రతికూలంగా ఉన్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు గ్లోబల్‌ టెక్నాలజీ సర్వీస్‌లకు గడ్డు పరిస్థితులకు కారణమని ఇండస్ట్రీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

2021-22 ఆర్ధిక సంవత్సరం నుంచి టెక్నాలజీ రంగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మందగమనం, అంతర్జాతీయ రాజకీయ, భౌగోళిక పరిస్థితులతో టెక్నాలజీ కంపెనీల డిమాండ్‌ తగ్గిపోయింది. పరిస్థితులు ఇలానే కొనసాగితే టెక్నాలజీ కంపెనీలు 2-4 శాతం ఉద్యోగుల నియామకాలు తక్కువగా చేసే అవకాశం ఉందని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సునీల్‌. సి అభిప్రాయపడ్డారు.

- Advertisement -

దేశంలో రెండో అతి పెద్ద ఐటీ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్‌ రెండోత్రైమాసిక ఆర్ధిక ఫలితాల వెల్లడించిన సందర్బంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో కాలేజీ క్యాంప్‌ల నుంచి రిక్రూట్‌మెంట్లను నిలి పివేస్తున్నట్లు ప్రకటించింది. మరో ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్‌ కూడా కొత్త వారిని ఉద్యోగంలోకి తీసుకోవడాని ్న తగ్గించుకోవాలని నిర్ణయించింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో టాప్‌ 3 ఐటీ కంపెనీల్లోనే కనీసం 50 వేల మంది కొత్త ఉద్యగాల రిక్రూట్‌మెంట్‌ తగ్గిపోనుంది.

మొత్తంగా చూస్తే ఈ ఆర్ధిక సంవత్సరంలో ఐటీ కంపెనీల్లో ఉద్యోగ నియామకాలు 4 శాతం వరకు తగ్గిపోనున్నాయి. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ బాటలోనే మిగిలిన ఐటీ కంపెనీలు కూడా కొత్త వారిని తీసుకునే విషయంలో నిర్ణయంచుకుంటే కనీసం ఈ ఆర్ధిక సంవత్సరంలో 2 లక్షల ఐటీ కొత్త ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ నిలిచిపోనుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి.

దీని ఫలితంగానే కంపెనీలు కొత్త వారిని నియామించుకునే విషయంలో ఆచితూచీ వ్యవహరిస్తున్నాయి. ఈ పరిస్థితి 2024-25 ఆర్ధిక సంవత్సరంలోనూ కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో ప్రతి సంవత్సరం 9 లక్షల మంది విద్యార్ధులు ఇంజినీరింగ్‌ పూర్తి కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. వీరిలో ఏటా కనీసం 2 లక్షల మందిని ఐటీ కంపెనీలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి.

ఇప్పుడు ఈ ఉద్యోగాలన్నీ రిస్క్‌లో పడినట్లేనని ప్రముఖ రిక్రూటింగ్‌ సంస్థ జీఫోనీ సహా వ్యవస్థాపకుడు కమల్‌ క్రాంత్‌ అభిప్రాయపడ్డారు. ఈ ఆర్ధిక సంవత్సరం మిగిలిన త్రైమాసికాల్లోనూ ఐటీ కంపెనీలు దాదాపు కొత్త రిక్రూట్‌మెంట్లు చేసే పరిస్థితుల్లో లేవని టీమ్‌ లీజ్‌ డిజిటల్‌కు చెందిన సునీల్‌ చెప్పారు. కొన్ని ఐటీ కంపెనీలు పెద్ద ఒప్పందాలు చేసుకున్నప్పటికీ, వీటికి పెద్దగా కొత్త ఉద్యోగుల అవసరం లేకుండానే, ఈ ఒప్పందాలను పూర్తి చేసే పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు.

సంవత్సరం క్రితం కూడా ఐటీ కంపెనీలు భారీగానే ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకున్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో టాప్‌ 3 ఐటీ కంపెనీలు రెండు శాతం ఉద్యోగులను తక్కువగా రిక్రూట్‌ చేసుకున్నాయి. రెండో త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ 4.2 శాతం కొత్త ఉద్యోగులను తగ్గించుకుంది.

టీసీఎస్‌ 1శాతం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 2 శాతం కొత్త ఉద్యోగుల నియామకాలను తగ్గించుకున్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ రానున్న కాలంలో రిక్రూట్‌మెంట్‌ గైడెన్స్‌ను మరింత తగ్గించుకుంది. గత 20 సంవత్సరాల్లో ఇంతలా కొత్త రిక్రూట్‌మెంట్‌ను ఐటీ కంపెనీలు ఇంతలా తగ్గించుకోవడం ఇదే మొదటిసారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement