ఈ సారి పండుగల సీజన్లో స్వీట్లు, స్నాక్స్ వ్యాపారం గణనీయంగా పెరుగుతుందని స్వీట్లు, నమ్కీన్ తయారీ సమాఖ్య డైరెక్టర్ ఫిరోజ్ హెచ్ నక్వీ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వీటి అమ్మకాల విలువ 1.25 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసినట్లు చెప్పారు. గత నెల రక్షాబంధన్ సందర్భంగా స్వీట్లు వ్యాపారంలో గణనీయమైన వృద్ధి నమోదైందని చెప్పారు. ప్రస్తుతం గణష్ ఉత్సవాల సందర్భంగా కూడా చాలా రకాల స్వీట్స్కు మంచి డిమాండ్ ఉంటుందన్నారు. వచ్చే దసర, దీపావళీ, హోలీ పండగల సమయాల్లోనూ స్వీట్స్కు, స్నాక్స్కు భారీ డిమాండ్ ఏర్పడుతుందన్నారు. కరోనా సమయంలో స్వీట్స్ పరిశ్రమ చాలా నష్టపోయిందని ఫిరోజ్ చెప్పారు. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఈ పరిశ్రమ 35 కోట్ల వరకు నష్టపోయిందన్నారు. 2021-22లో కరోనా నాటి పరిస్థితులు చక్కబడ్డాయని, దీని వల్ల వ్యాపారం 1.10 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం మరింత వృద్ధి సాధింస్తుందన్నారు.
పాలతో తయారు చేసే స్వీట్లను బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్ వంటి దేశాలకు పంపడంలో ఆక్షలు ఉన్నాయని, దీని వల్ల ఎగుమతుల విలు 2000-3000 కోట్ల వరకు మాత్రమే పరిమితమైందన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించాలని కోరారు. డ్రై ఫ్రూట్స్ ద్వారా తయారవుతున్న కాజూ స్వీట్స్కు గల్ఫ్ దేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. స్వీట్లు, నమ్కీన్ పరిశ్రమ ద్వారా ఏటా ప్రత్యక్షంగా, పరోక్షంగా కోటి మందికి పైగా ఉపాధి పొందుతున్నారని చెప్పారు.