Friday, May 17, 2024

Nagababu: జ‌న‌సేన విజ‌యానికి కృషి చేయండి… ఎన్ఆర్ఐల‌కు నాగ‌బాబు పిలుపు..

2024 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి, జనసేన పార్టీకి చాలా కీలకమని, ప్రవాసాంధ్రులంతా పార్టీ గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కోరారు. అవకాశం ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ జన సైనికుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ గెలుపు కోసం అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

మంగ‌ళ‌గిరి జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం నుంచి సోమవారం ఉదయం యూఎస్ కు చెందిన ప్రవాసాంధ్రులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో పని చేసే అంశంపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రవాసుల పాత్ర ఎంతో కీలకం. ఎన్ఆర్ఐ జన సైనికులంతా పార్టీ గెలుపు కోసం పనిచేయాల‌న్నారు.

తటస్ట ఓటర్లను జనసేన వైపు ఆకర్షించాలని కోరారు. పార్టీ సిద్ధాంతాలు, భావ జాలాన్ని, పవన్ నిర్ణయాలను సామాన్యులకు అర్ధమయ్యేలా వివరించాలని సూచించారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన రాజోలు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకుని పని చేయాలని చెప్పారు. ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నవారు తప్పకుండా స్వదేశం వచ్చి పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి రావడానికి అవకాశం లేని వారు అక్కడి నుంచే పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలని తెలిపారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న జనసైనికులను సమాయత్తం చేసేందుకు త్వరలో యూఎస్‌లో పర్యటిస్తానని నాగబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ ఆస్ట్రేలియా కన్వీనర్ శ్రీ శశిధర్ కొలికొండ సమన్వయం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement