Monday, April 29, 2024

పట్టపగలే మహిళ హత్య..

దత్తిరాజేరు, (ప్రభ న్యూస్‌): మండలంలో గల పెదమానాపురం, ముద్దానపేట గ్రామాల మధ్య పొలాల్లో ముద్దాన చిన్నమ్మలు(40) అనే మహిళ హత్యకు గురైంది. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతురాలి తలకు, ముఖానికి బలమైన గాయాలున్నాయి. సంఘటనా స్థలంలోనే ఆమె మృతిచెందిందని, మెడలో ఉన్న బంగారపు పుస్తెలతాడు, చైన్‌ను తీసుకొని హత్య చేసి నిందితుడు పరారై ఉండవచ్చని భావిస్తున్నారు. ముద్దానపేట గ్రామానికి చెందిన చిన్నమ్మలు, మామిడి లక్ష్మి కలిసి శనివారం బంధువులు ఇంటికి విజయనగరం వెళ్లారు.

ఆదివారం తిరిగి విజయనగరంలో కెఎల్‌పురంలో బస్సు ఎక్కి పెదమానాపురంలో దిగారు. అక్కడ నుండి రేషన్‌ షాపు వద్ద పని ఉందని చెప్పి మామిడిలక్ష్మి ఉండిపోగా మృతురాలు చిన్నములు నడుచుకుంటూ వెళ్లింది. అంతలో ఈ సంఘటనలో జరిగిందని అంటున్నారు. పట్ట పగలే హత్య జరగడంతో రెండు గ్రామాల్లో ప్రజలకు భయాందోళనలు నెలకున్నాయి. మృతురాలకు భర్త రమణ ఒక్కరే ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తూ జీవనం గడిపేది.

ఘటనా స్ధలానికి డీఎస్పీ మోహన్‌రావు, సర్కిల్ ఇన్స‌స్పెక్టర్‌ రమేష్‌, పెదమానాపురం, గజపతినగరం, ఆండ్ర ఎస్‌ఐలు భాగ్యం, గంగరాజు, సుదర్శరావు చేరుకొని వివిధ కోణాలలో పరిశీలించారు. విజయనగరం నుండి క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ కూడా సంఘటనా స్ధలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని గజపతినగరం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement