Saturday, May 4, 2024

AP: దండుపాళ్యం బ్యాచ్ కి.. వాళ్లకీ తేడా ఏముంది ? .. వైసీపీని నిలదీసిన పవన్

విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో : మీ వాలంటీర్లు తప్పులు చేస్తే అధికార పార్టీ నాయకులు పరామర్శకు కూడా రారా. తప్పు ఎవరు చేసినా తప్పే. బాధ్యతగా వచ్చి పరామర్శించి భరోసా ఇవ్వకపోతే ఎలా ? అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పోలీసు వెరిఫికేషన్ లేదు. సర్టిఫికెట్లు తీసుకున్నారో లేదో తెలియదు. వాలంటీర్ల పేరిట సమాంతర వ్యవస్థ తీసుకువచ్చి ఈ ప్రభుత్వం నేరుగా ఇళ్లలోకి పంపివేసిందన్నారు. ఇంట్లో ఏ సమయంలో ఎవరెవరు ఉంటారు ? ఎవరు ఎక్కడ ఉద్యోగం చేస్తారు ? అన్న సమాచారం మొత్తం వారికి తెలిసిపోవడమే ఇలాంటి సంఘటనలకు కారణం అన్నారు. ఇళ్లలో ఉండే పెద్దల వివరాలు తెలుసుకుని కరుడుగట్టిన నేరాలకు పాల్పడే దండుపాళ్యం బ్యాచ్ కి వీళ్లకి తేడా ఏముందని ప్రశ్నించారు. శనివారం ఇటీవల విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు కోటగిరి వరలక్ష్మి కుటుంబ సభ్యులను పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ నేతలతో కలసి వెళ్లి పరామర్శించారు. వరలక్ష్మి గారి భర్త గోపాలకృష్ణ, కుమారుడు వెంకటేష్ లతో పాటు కుమార్తెను పరామర్శించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “వాలంటీర్ల వద్ద ప్రతి ఇంటి సమాచారం ఉంటుంది. ప్రతి ఒక్కరి వివరాలు ఉంటున్నాయి. ఎవరు ఏం చేస్తారు ? ఏ సమయంలో ఎవరు ఇంట్లో ఉంటారు ? అన్న వివరాలు వాలంటీర్ ముసుగులో సులువుగా తెలుసుకోగలుగుతున్నారు. ఇటీవల మారేడుమిల్లి ప్రాంతంలో తాటి కుండల్లో విషం కలిపేశాడు ఓ వాలంటీర్. సమాంతర వ్యవస్థలే ఇలాంటి దారుణాలకు కారణం. పోలీసుల శాఖకు ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు విషయం తెలియదు. బెదిరింపులు, గొలుసులు తెంచుకుపోవడాలు లాంటి సంఘటనలు పెరిగాయి. ఇలాంటి నేరాలు గతంలోనూ ఉన్నాయి. అయితే వాలంటీర్లకు ఎలాంటి వేరిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగానికి సర్టిఫికెట్లు కావాలి. వాలంటీర్ వ్యవస్థకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉందో తెలియదు. చిన్న పరీక్ష రాయించి ఉద్యోగాలు ఇచ్చేశారు. చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం ఇవ్వాలన్నా అన్ని వివరాలు తెలుసుకుని గాని ఇవ్వం. నేరుగా ఇళ్లలోకి పంపేసేటప్పుడు కనీసం పోలీసు ఎంక్వయిరీ లేకుండా ఉద్యోగాలు ఇచ్చేస్తారా ? వైసీపీ కార్యకర్త అయితే చాలు అన్నట్టు ఉద్యోగాలు ఇచ్చేశారు.

చట్టం బలంగా పని చేస్తుందన్న భయం ఉంటే ఇలాంటి తప్పులు జరగవు. కాకినాడలో వారాహి యాత్రలో శాలివాహన కుటుంబానికి చెందిన ఓ వయసు మళ్లిన జంట ఇలాంటి భయాన్నే వ్యక్తం చేశారు. తప్పుడు పనులు చేస్తే బయటికి వచ్చేయొచ్చులే అన్న భావన ఇలాంటి పనులకు పురిగొల్పుతుంది. చట్టం బలంగా పని చేస్తుంది.. శిక్ష పడుతుంది.. తోలు తీసేస్తారు అన్న భయం ఉంటే తప్పుడు పనులు చేయడానికి ఆలోచిస్తారు. నేరాలు చేసే వారికి భయం ఉంటుంది. లా అండ్ ఆర్డర్ బలంగా పని చేస్తుందన్న భావన ప్రజల్లో ఉంటే ఇలాంటివి పునరావృతం కావు. పిల్లలు వృద్ధిలోకి వచ్చి ప్రశాంతంగా గడపాల్సిన వయసులో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. నేరస్తులు బయటికి వస్తే సమాజానికి చేటు. నేరం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. అన్నం పెట్టిన చేతినే నరికేశాడు. వరలక్ష్మి కుటుంబానికి జనసేన పార్టీ తరపున అండగా నిలుస్తాం. ఘటన గురించి తెలుసుకుని చాలా బాధ కలిగింది. న్యాయపరంగా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాను. ఇలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదన్నారు.

- Advertisement -

వరలక్ష్మి కుటుంబానికి ఓదార్పు…

పెందుర్తి నియోజకవర్గం, సుజాత నగర్ లో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆమె స్వగృహానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. భర్త, కుమారుడు, కుమార్తెను అడిగి హత్య తాలూకు వివరాలు తెలుసుకున్నారు. వరలక్ష్మి హత్య జరిగిన గదిని పరిశీలించారు. ఆమె కుటుంబ సభ్యులను అక్కున చేర్చుకుని ఓదార్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె ఫోటోలు చూసి పవన్ కళ్యాణ్ కళ్లు చమర్చాయి.

పవన్ కళ్యాణ్ అండగా ఉంటారన్న ధైర్యంతో ఉన్నాం : వరలక్ష్మి కుటుంబ సభ్యులు

ఈ సందర్భంగా వరలక్ష్మి కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ కు హత్య పూర్వాపరాలు తెలియచేశారు. ఇంత దారుణం జరిగితే కనీసం పలకరించేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. మీరు వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రశ్నించిన సమయంలోనే మా ఇంట్లో ఈ ఘటన జరిగింది. వాలంటీర్ల దగ్గర ప్రతి ఒక్కరి వివరాలు ఉంటున్నాయి. వాళ్లకు ఎవరు ఏ సమయంలో ఇంట్లో ఉంటారన్న వివరాలు ఉంటున్నాయి. ఈ ఘోరానికి కారణం కూడా అదే. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు. నింధితుడికి కఠిన శిక్ష అమలయ్యేలా మీ సహకారం కావాలి. కోడలు పేరు మీద ఇల్లు ఉందని ఆమెకు ఉన్న ఫించన్ తీసేశారు. వారం రోజుల ముందు నుంచే మా అమ్మను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. అమ్మ అన్నం పెడితే తిన్నాడు. ఆమెనే చంపేశాడు. లక్ష రూపాయలు విలువ చేసే గోల్డ్ చైన్ కోసం ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. 100 మందిలో 50 మంది ఇలాంటి వారే ఉన్నారు. సిసి కెమెరాలు పని చేయడం వల్లే నేరస్తుడు దొరికాడు. మా అమ్మని చంపిన వాడు బయటికి రాకూడదు. మీరు ఇక్కడి వరకు రావడమే మాకు పెద్ద ఓదార్పు అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement