Thursday, May 9, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమాచారం ఇచ్చేందుకు కేంద్రం నిరాకరణ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ నిరాకరించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై ఆర్టీఐ కింద అడిగిన సమాచారాన్ని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ నిరాకరించింది. ఆర్టీఐ కార్యకర్త ఇనుగంటి రవికుమార్ అడిగిన సమాచారాన్ని నిరాకరించిన కేంద్ర ఆర్ధికశాఖ.. విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ అంశం ఆర్ధిక రహస్యాల పరిధిలోకి వస్తుందని డీఐపీఏఎం పేర్కొంది. ఈ అంశంపై సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు రాసిన లేఖలపై సమాధానం ఇవ్వాలంటూ ప్రధాని కార్యాలయం ఆదేశించినా డీఐపీఏఎం పట్టించుకోలేదు. విశాఖ స్టీల్ ప్లాంటులో పెట్టుబడుల ఉప సంహరణ సమాచారం సెక్షన్ 8 (1) (ఏ) కింద గోప్యంగా ఉంచాలని డీఐపీఏఎం పేర్కొంది.

కాగా నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అందులో భాగంగా నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర కేబినెట్ తీర్మానించింది. అయితే కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికీ ఉద్యమం జరుగుతూనే ఉంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సైతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement