Thursday, April 25, 2024

విశాఖలో టీడీపీ నేతల భూకబ్జాలు బట్టబయలవుతోంది: అంబటి

విశాఖలో టీడీపీ నేతలు భారీగా భూకబ్జాలకు పాల్పడ్డారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. భూ ఆక్రమణలకు పాల్పడిన వారి నుంచే తమ ప్రభుత్వం తిరిగి భూములను స్వాధీనం చేసుకుంటోందని చెప్పారు. చంద్రబాబు హయాంలో విశాఖలోని అతి ఖరీదైన భూములను పప్పుబెల్లాల్లా లీజుకు ఇచ్చారని తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా విశాఖలో భూములు ఆక్రమించిన వైనం ఇప్పుడు బట్టబయలవుతోందన్నారు. ఇప్పుడు చంద్రబాబు గగ్గోలు పెట్టడంలో అర్థంలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమిస్తే ప్రభుత్వం అడ్డుకుంటోందని స్పష్టం చేశారు. 

ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములనే స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. లీజులు ముగిసిన తర్వాత కూడా భూముల్లో తిష్ట వేస్తున్నవారిని ఏం చేయాలని అంబటి ప్రశ్నించారు.  చంద్రబాబు హయాంలో విశాఖలో భూకుంభకోణాలు జరిగితే, కొందరు ప్రజాప్రతినిధుల అండతోనే ఈ దందా నడుస్తోందని అప్పటి రోడ్లు, భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అనలేదా? అని అంబటి నిలదీశారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారికి చెందిన పాఠశాలను కూడా పడగొట్టేస్తున్నారంటూ తమ ప్రభుత్వంపై ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మానసిక దివ్యాంగుల పాఠశాలల పేరిట జరిగే దురాక్రమణలపై మాత్రమే తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంబటి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement