Monday, May 6, 2024

AP: కేంద్రంతో పవన్ కళ్యాణ్ కు మంచి సత్సంబంధాలు…కొణతాల

కశింకోట, ఫిబ్రవరి27 (ప్రభ న్యూస్): కేంద్రంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మంచి సత్సంబంధాలు ఉన్నాయని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ సహకారం అవసరం అనీ మాజీ మంత్రి, టిడిపి, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం మండలంలో తాళ్లపాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు తోరం గణేష్ ఇటీవల గాయపడడంతో స్వయంగా ఇంటికి వెళ్ళి కొణతాల పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దేశ ప్రధామంత్రి మోదీతో పవన్ కళ్యాణ్ కు పుష్కలంగా అండదండలు ఉన్నాయన్నారు. ఉత్తరాంధ్రలో సృజల స్రవంతి ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత ప్రజలు చిరకాల కోరిక నెరవేరుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమని ఇప్పటివరకు తాను అందుకే పార్టీలో చేరడం ఆలస్యమైందన్నారు.

పవన్ కళ్యాణ్ కు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉందన్నారు. స్వార్థం లేని నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. నిబద్ధతతో పనిచేసే నాయకుడు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని టీడీపీతో పవన్ కళ్యాణ్ కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చారని వివరించారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని,రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు కలిసి పనిచేయాలని, అనకాపల్లిలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతుందన్నారు.

చదువుకున్న యువతకు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందీ పడుతున్నారని, ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా టీడీపీ, జనసేన పార్టీలు కృషి చేస్తున్నాయ‌న్నారు. పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్ష ఇచ్చి యువతను ప్రోత్సాహం కూడా చేస్తామన్నారు. జనసేన కుటుంబ సభ్యులు, టీడీపీ కుటుంబ సభ్యులతో సమావేశం అవుతానని అప్పుడు కార్యచరణ ఉంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పీలా సత్యనారాయణ అందుబాటులో లేరని వచ్చిన తరువాత కలిసి మాట్లాడి పనిచేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కర్రి వెంకట సత్యనారాయణ, కర్రి గోవింద, కర్రి లోవరాజు, చెట్టుపల్లి అప్పలనాయుడు, బలిజ ముసిలినాయుడు, గొంతిన ఈశ్వరరావు, ఐనాల నాయుడు, శ్రీరామదాసు నాయుడు నాయుడు, కలగ గోవింద, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement