Saturday, May 4, 2024

రేపే జగనన్న తోడు ! చిరు వ్యాపారుల కోసం ప్రత్యేక కార్యక్రమం..

అమరావతి, ఆంధ్రప్రభ : నడ్డి విరిచే వడ్డీలకు చెల్లుచీటీ చెబుతూ చిరు వ్యాపారులకు అండగా నిలబడాలన్న సదుద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం కింద బుధవారం చిరు వ్యాపారులకు రూ.10 వేల వంతున రుణాలు అందించే కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ రుణాలకు సంబంధించి పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ.395 కోట్లు కొత్త రుణాలు అందించనున్నారు. దీనితో పాటు, గత 6 నెలలకు సంబంధించిన రూ.15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కడం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

వీరందరికీ జగనన్న తోడు…

గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడగులు పొడవు, 5 అడుగులు వెడల్పు స్ధలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్నవారందరూ ఈ పథకం కింద అర్హులుగా ప్రకటిస్తున్నారు. వీరితోపాటు పుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్మకుని జీవించేవారు, రోడ్ల పక్కన టిఫిన్‌ సెంటర్లు నిర్వహించేవారు, గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారు, సైకిల్‌, మోటారు సైకిల్‌, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసేవారితో పాటు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు… ఇత్తడి పని చేసేవాళ్లు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బమ్మల తయారీ, లేస్‌ వర్క్స్‌, కలంకారీ, తోలుబొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వంటి వారందరికీ ప్రభుత్వం వడ్డీ లేకుండా రూ.10 వేల వంతున రుణాలు అందజేస్తోంది. సుదీర్ఘ పాదయాత్రలో ఈ చిరు వ్యాపారుల కష్టాలను చూసిన, వారి కడగండ్లను స్వయంగా విన్న ముఖ్యమంత్రి జగన్‌ ఆపరిస్థితులను మారుస్తూ, నిత్య కష్టంపైనే ఆధారపడి, గౌరవంగా జీవిస్తున్న వారిని ఆదుకోవడం కోసం, సున్నా వడ్డీకే రుణాలు అందిస్తూ జగనన్న తోడు పథకం అమలు చేస్తున్నారు.

- Advertisement -

దేశంలోనే అత్యధిక రుణాలు…

దేశంలో అత్యధికంగా వడ్డీలేని రుణాలు అందిస్తున్న ప్రభుత్వంగా వైయస్‌ జగన్‌ ప్రభుత్వం గుర్తింపు పొందింది. బుధవారం అందిస్తున్న రూ.395 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు రూ.15,31,347 మంది చిరు వ్యాపారాలు చేసుకునే లబ్ధిదారులకు రూ.2,406 కోట్లమేర వడ్డీలేని రుణాలు – అందించారు. వీరిలో సకాలంలో రుణాలు చెల్లించి రెండోసారి రుణం కోరి పొందిన వారు 8,74,745 మంది ఉన్నారు. కాగా, బుధవారం అందిస్తున్న వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ రూ.15.17 కోట్లతో కలిపి సకాలంలో రుణాలు చెల్లించిన 13.28 లక్షల లబ్ధిదారులకు ఇప్పటివరకు ప్రభుత్వం రూ. 63.65 కోట్ల మేర వడ్డీని తిరిగి చెల్లించింది. ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న చురు-కై-న చర్యల కారణంగా సకాలంలో రుణాలు చెల్లించిన వీధి వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల వారికి నిత్యం మూలధనం అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. ఏ ఏడాదికి ఆ ఏడాది రుణాల మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.11 వేలకు, రూ.11 వేల నుంచి రూ.12 వేలకు, రూ.12 వేల నుంచి రూ.13వేలకు పెంచుతూ బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement