Saturday, May 18, 2024

Tirumala brahmotsvas – ఘనంగా బంగారు గొడుగు ఉత్సవం

తిరుమల, సెప్టెంబరు 24: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం ఆదివారం సాయంత్రం తిరుమలలో ఘనంగా జరిగింది. సెప్టెంబ‌రు 25వ తేదీ సోమ‌వారం శ్రీవారి రథోత్సవాన్ని పురస్కరించుకొని అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయం మేరకు ముందురోజు సాయంత్రం శ్రీవారి కల్యాణకట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపనాన్ని చేస్తారు. ఇందుకోసం ప్రధాన కల్యాణకట్టలో బంగారు గొడుగుకు ప్రత్యేక పూజలు చేశారు. . అనంతరం టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి అప్పగించారు.

.

 ఈ సంద‌ర్భంగా టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో మొట్టమొదటి మంగల‌ కట్ట (కళ్యాణ కట్ట)ను ఏర్పాటుచేసి యాత్రికులకు తలనీలాలు సమర్పించుకునే వసతి కల్పించిన పంతులు గారి వంశస్థులు వంశపారంపర్యంగా శ్రీవారి రథానికి గొడుగు సమర్పించ‌డం ఎంతోకాలంగా ఆచారంగా వ‌స్తోంద‌న్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రారంభమైన ఈ ఆచారం ఆ తర్వాత మహంతుల పాలనలో కూడా కొనసాగిందని చెప్పారు. 1946వ సంవత్సరంలో పంతులు గారి వంశస్తులైన ధర్మకర్త శివరామయ్య, టీటీడీకి మధ్య జరిగిన ఒప్పందం మేరకు కళ్యాణకట్టను టీటీడీకి అప్పగించార‌ని తెలిపారు. అప్పట్లో జరిగిన ఒప్పందం మేరకు స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంలో  పంతులుగారి వంశస్థులు బంగారు గొడుగుకు పూజలు నిర్వహించి తిరుమల మాడవీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారి రథానికి బంగారు గొడుగు ప్రతిష్టించే ఆచారం కొనసాగుతోంద‌న్నారు. పంతులు గారి వంశస్తులైన శివరామయ్య కుమారుడు రామనాథన్ గత 39 సంవత్సరాల నుండి బంగారు గొడుగులకు పూజలు నిర్వహించి కళ్యాణకట్ట నుండి నాలుగుమాడ గుండా మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్ళి స్వామివారి రథానికి సమర్పిస్తున్నార‌ని, ఇది ఆయ‌న పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌ని చెప్పారు.

కాగా పంతులుగారి ప్రస్తుత వంశీకుడైన పంతులుగారి రామనాథన్‌ ఆధ్వర్యంలో కల్యాణకట్ట క్షురకులు, సిబ్బంది, సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మంలో బోర్డు స‌భ్యులు యానాద‌య్య‌, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో లోక‌నాథం, కల్యాణకట్ట డెప్యూటీ ఈవో సెల్వం, ఏఈవో ర‌మాకాంత‌రావు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement