Wednesday, May 15, 2024

గుసగుస: ఆ ముగ్గురు కూడా సేఫట.. జగన్ కేబినెట్‌లో కొత్తగా చోటుదక్కేది ఎవ‌రికో?

ఏపీలో ఉగాదికి మంత్రి వర్గ విస్తరణ జరగబోతోంది. ప్రస్తుతం ఉన్నమంత్రుల స్థానాల్లో కొత్తవారు రాబోతున్నారు. కొందరు కొనసాగే అవకాశం ఉందని సీఎం జగన్ ఇప్పటికే చెప్పారు. ఫైర్ బ్రాండ్ మంత్రులు మాత్రమే కొనసాగుతారని అంతా అనుకున్నారు. కానీ, మరో ముగ్గురు కేబినెట్‌లో కొనసాగే ఛాన్స్ ఉందని తాజాగా పార్టీ వర్గాలు చెబుతున్నాయ్. ఏపీ కేబినెట్లో సీఎం జగన్‌తో కలిపి మొత్తం 25 మంది ఉండగా 10 మంది కొనసాగితే కొత్తగా 15 మందికి మాత్రమే ఛాన్స్ లభించే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ప్రాతిపదిక కులాల ఈక్వేషన్లతో కొత్తగా చోటు ఎవరికి దక్కుతుందోనన్న గుబులు ఆశావహుల్లో ఎక్కువవుతోంది. ఏపీలో మంత్రి వర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో అనేక సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి.

ఇందులో భాగంగా కొత్త వాళ్లు ఎవరు రాబోతున్నారు అనే దానికన్నా ప్రస్తుతం ఉన్న వారిలో ఎవరు కొనసాగుతారన్న చర్చ కీల‌కంగా మారుతోంది. నిన్నా, మొన్నటి వరకూ సీనియర్ మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి, బాలినేని, బొత్స, బుగ్గన, కన్నబాబు, పేర్ని నాని, కొడాలి వంటి కీలక మంత్రులు కంటిన్యూ అవుతారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మరో కొత్త విషయం తెరపైకి వచ్చింది. సీనియర్లతోపాటు మరో ముగ్గురు అదృష్టజాతకులు కేబినెట్‌లో కంటిన్యూ కానున్నారట. వైసీపీ శాసనసభా పక్ష సమావేశంలో సీఎం జగన్ చేసిన కామెంట్స్ కొత్త ప్రచారానికి తెరలేపాయి. కేబినేట్‌లో చోటు కోల్పోయిన మంత్రులు పార్టీకి పనిచేయాలని కేవలం కుల సమీకరణాలు నేపథ్యంలోనే కొందరు కొనసాగుతారన్నారు. సీఎం వ్యాఖ్యలతో కులాల వారీగా కొనసాగే వారి లిస్ట్ ఇదేనంటూ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement