Saturday, May 4, 2024

రెండేళ్లలో 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా చలనం లేదు: నారా లోకేష్

ఏపీలో వైఎస్ఆర్సీపీ రెండేళ్ల పాలనలో 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అయినా వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తామంటూ ఆశపెట్టి నిరుద్యోగ యువతను బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు.

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం చనుగొండ్ల గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు గోపాల్ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని లోకేష్ తెలిపారు. తల్లిదండ్రులు స్తోమత లేకపోయినా రెక్కల కష్టంతో గోపాల్ ను ఉన్నత చదువులు చదివించారని చెప్పారు. రెండేళ్ల పాటు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూసిన గోపాల్, తనకు ఉద్యోగం లేదని మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయం మరే ఇతర కుటుంబానికి జరగకుండా పోరాటం చేయాలని గోపాల్ తమ్ముడు శ్రీనివాసులు రాసిన లేఖ తనకు అందిందని లోకేష్ వివరించారు.

“మీ కుటుంబం పడుతున్న వేదనను నేను అర్థం చేసుకోగలను. త్వరలోనే నేను చనుగొండ్ల గ్రామానికి వచ్చి మీ అమ్మానాన్నలను కలుస్తాను. మీ కుటుంబానికి కలిగిన శోకం రాష్ట్రంలో మరే కుటుంబానికి కలగకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ముందుండి పోరాటాన్ని నడిపిస్తాను. ఇచ్చిన హామీ మేరకు జగన్ 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేసేంతవరకు నా పోరాటం ఆగదు” అని నారా లోకేష్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement