Thursday, May 9, 2024

Support to Chandrababu – జ‌గ‌న్ పై నిప్పులు చెరిగిన మోత్కుప‌ల్లి…నీకేమైనా సిగ్గుందా అంటూ నిల‌దీత ..

హైద‌రాబాద్ . .. ఎపి సిఎం జ‌గ‌న్ పై మాజీ టిడిపి నేత మోత్కుప‌ల్లి న‌ర్శింహులు నిప్పులు చెరిగారు.. మాజీ సిఎం,టిడిపి అధినేత చంద్ర‌బాబు ను అరెస్ట్ చేయ‌డాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు.. ఎన్టీఆర్ ఘాట్ ను నేడు సందర్శించిన మోత్కుపల్లి, ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, యువకుడు, ఉత్సాహవంతుడు ఒకసారి అవకాశం ఇస్తే బాగా పాలిస్తాడనే ఉద్దేశంతో జగన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. తాను కూడా అదే ఉద్దేశంతో గత ఎన్నికలకు ముందు జగన్ కు ఓటేయాలని పిలుపునిచ్చానని చెప్పారు. అయితే, అధికారంలోకి రాగానే జగన్ కు మైకం కమ్మిందని విమర్శించారు. తన విజయానికి పాటుపడ్డ తల్లిని, చెల్లిని జగన్ బయటకు పంపించాడని ఆరోపించారు. ప్రజల కోసమే నిరంతరం ఆలోచించే ప్రజా నాయకుడు చంద్రబాబును జైలుకు పంపి జగన్ రాక్షసానందం పొందుతున్నాడని విమర్శించారు. ‘జగన్.. వయసులో చిన్నవాడివి.. నీకేమైనా సిగ్గుందా.. చంద్రబాబు లాంటి గొప్ప నాయకుడిని అరెస్టు చేయిస్తవా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు అవినీతికి పాల్పడే నేత కానే కాదని, క్రిమినల్ అసలే కాదని మోత్కుపల్లి స్పష్టం చేశారు. స్కిల్ కేసు పేరుతో ఎన్నికల ముందు అరెస్టు చేయించడాన్ని తప్పుబట్టారు. చంద్రబాబు అవినీతి చేశాడని ఆరోపిస్తున్న జగన్.. ఈ నాలుగేళ్ల పాలనలో ఏంచేశాడని నిలదీశారు. లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి ప్రజలకు సొమ్ము పంచిన చంద్రబాబు ఈ ముష్టి 370 కోట్లకు ఆశపడతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు వయసుకైనా గౌరవమిచ్చి ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement