Thursday, May 2, 2024

తిరుమ‌ల‌లో జూన్‌1 నుంచి స్ట్రిక్ట్ రూల్స్‌.. ప్లాస్టిక్ వాడితే షాప్ సీజ్ చేస్తామ‌న్న అధికారులు

తిరుమల: తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం జూన్ 1వ తేదీ నుండి సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం నిర్ణయించింది. తిరుమల ఆస్థానమండపంలో మంగళవారం దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులతో టీటీడీ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి మల్లికార్జున మాట్లాడుతూ ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని, అలిపిరి చెక్ పాయింట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని తెలిపారు.

ప్లాస్టిక్ కవర్లలో వచ్చే ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. పంచెలు, బొమ్మలు, ఇతర వస్తువులకు ప్లాస్టిక్ కవర్ల ప్యాకింగ్ లేకుండా బయోడిగ్రేడబుల్ కవర్లు గాని, పేపర్ కవర్లు గాని ఉపయోగించాల‌ని సూచించారు మ‌ల్లికార్జున‌. ప్లాస్టిక్ షాంపూ పొట్లాలు కూడా కొండ‌మీద విక్రయించరాదన్నారు. హోటళ్ల నిర్వాహకులు, మఠాల నిర్వాహకులు కూడా ప్లాస్టిక్ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. దుకాణాల వద్ద అధిక ధరలకు విక్రయించకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

అదేవిధంగా టిటిడి ఆరోగ్యశాఖ అధికారి శ్రీదేవి మాట్లాడుతూ.. హోటళ్లు, దుకాణాల నిర్వాహకులు తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా డస్ట్ బిన్లలో ఉంచాలని, తద్వారా సేకరణకు అనువుగా ఉంటుందని అన్నారు. దుకాణాల్లో అనుమతించిన వస్తువులనే విక్రయించాలన్నారు. దుకాణదారులు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు మాస్ క్లీనింగ్ చేపట్టాలని కోరారు. టిటిడి విజిఓ బాలిరెడ్డి మాట్లాడుతూ.. జూన్ ఒకటో తేదీ నుంచి విజిలెన్స్, హెల్త్, ఎస్టేట్ అధికారులు నిరంతరంగా తనిఖీలు చేసి ప్లాస్టిక్ వస్తువులు ఎక్కడ కనిపించినా దుకాణాలను సీజ్ చేస్తారని తెలిపారు. దుకాణదారులు ఒక సంకల్పంతో ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ విభాగం ఏఈఓ చౌదరి, ఎవిఎస్వో సాయిగిరిధర్, దుకాణాలు, హోటళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement