Sunday, April 28, 2024

AP : శిరోముండ‌నం కేసు.. తోట త్రిమూర్తులుకు 18 నెల‌ల‌ జైలుశిక్ష‌

వైసిపి నేత తోట త్రిమూర్తులకు షాక్..!
శిరోముండనం కేసులో సంచలన తీర్పు శిక్ష
18 నెలలు జైలు శిక్ష తో పాటు 2.50లక్షల జరిమానా!
ప్రస్తుతం మండపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న తోట
1996 కేసుకి సంబంధించి విశాఖ న్యాయస్థానం తీర్పు
అతనితో పాటు మరి కొంతమందికి శిక్ష


విశాఖ క్రైం : ప్రభ న్యూస్ – వైసీపీ నాయకుడు తోట త్రిమూర్తులకు బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. 1996 నాటి కేసుకు సంబంధించి విశాఖ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఒక్కసారిగా వైసీపీ పార్టీలో కలకలం రేగింది. న్యాయస్థానం ఇచ్చిన ఊహించని తీర్పుకు తన భవిష్యత్తు ఏంటన్నది అతలాకుతలమవుతున్నారు. తనకు వ్యతిరేకంగా వ్యవహరించారన్న కోపంతో కొంతమంది దళితులను శిరో ముండనం చేసిన ఘటనకు సంబంధించి తనతో పాటు మరో తొమ్మిది మందికి కూడా కోర్టు శిక్ష విధించింది.

అప్పట్లో ఎమ్మెల్యేగా తాను పోటీ చేసిన క్రమంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంతో ఐదుగురు దళితుల్ని హింసించి, వీరిలో ఇద్దరికి శిరోముండనం చేయించిన ఆరోపణలు తోట త్రిమూర్తులుపై ఉన్నాయి. ఈ కేసు విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. 1996 నుంచి దాదాపు 150 సార్లు విచారణలు జరిగాయి. ఈ కేసులో తోట త్రిమూర్తులుతో పాటు మరో 9 మంది నిందితులుగా ఉన్నారు. ఎట్టకేలకు విశాఖలోని ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కేసుల ప్రత్యేక కోర్టు మంగళవారం శిక్ష ఖరారు చేసింది. దీనితో వైకాపా ఎమ్మెల్సీ కి గట్టి షాక్ తగిలినట్టైంది.

- Advertisement -

కేసు పూర్వపరాలు..

కాగా, 1996 డిసెంబర్ 29.. రామచంద్రాపురం మండలం వెంకటాయ పాలెంలో దళితయువకులకు ఘోర అవమానం జరిగింది. ఎన్నికల కారణాలతో ఐదుగురు దళిత యువకులను చిత్రహింసలు పెట్టారు. అందులో ఇద్దరికి గుండుకొట్టించి, కనుబొమ్మలు గీయించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్రకలకలం రేపింది. బాధితులకు న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు పెద్దఎత్తున ఉద్యమించాయి. దీంతో ఈకేసుపై 27 ఏళ్లుగా విచారణ జరిగింది. బాధితుల్లో వెంకటరమణ అనే వ్యక్తి మృతి చెందాడు.. మిగతా నలుగురు తమకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు.. ఈఘటనలో మొత్తం 24 మంది సాక్షులుగా గుర్తించారు.. వారిలో 11 మంది మృతి చెందారు.. ఇక ఈకేసులో ఆరుగురు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా పనిచేశారు. 1997 జనవరి ఒకటిన కేసుకు సంబంధించి క్రైమ్ నెంబర్ 1/1997గా ఎఫ్ఐఆర్ నమోదయింది.. ద్రాక్షారామ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. కేసుని ఫిబ్రవరి 2008న రీఓపెన్ చేశారు.. అయితే, 1994 సార్వత్రిక ఎన్నికల్లో తోట త్రిమూర్తులు ఇండిపెండెంట్‌గా రామచంద్రపురం నుంచి పోటీ చేసి గెలిచారు.. ఆ ఎన్నికల్లో ఆయన గంట గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు.. ప్రస్తుతం బాధితుల్లో ముగ్గురు ఆ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోలింగ్ ఏజెంట్ లు గా పని చేశారు. త్రిమూర్తులు వర్గం రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామని దాంతో వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారని కోర్టుకు తెలిపారు బాధితులు..

పొలం చుట్టూ ఫెన్సింగ్ ధ్వంసం , ఈవ్ టీజింగ్ కేసులను అక్రమంగా బనాయించి గ్రామస్తుల మధ్యలో ఘోరంగా అవమానించారని కోర్టుకు తెలిపారు బాధితులు… తోట త్రిమూర్తులు మాత్రం గ్రామ పెద్దల మధ్య జరిగిన పంచాయతీ అని తనకు సంబంధం లేదని చెప్తూ వస్తున్నారు. ఈ కేసు విచారణ హైకోర్టు వరకు వెళ్ళింది.. బాధితులు దళితులు కాదని కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని కొన్నాళ్ళు చర్చ జరిగింది.. కుల ధ్రువీకరణ పత్రం పై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ ను కూడా ఆదేశించారు. అయితే ఆరు నెలల్లో కేసు విచారణ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది.. ఈనెల మూడు వరకు ఇరుపక్షాల వాదనలు విన్న విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు బెంచ్ సమగ్రంగా వివరాలు తీసుకుంది.. తోట త్రిమూర్తులతో పాటు మిగిలిన వారికి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది కోర్టు.

జరిమానా.. జైలు శిక్ష..

విశాఖ న్యాయస్థానం తోట త్రిమూర్తులతో పాటు మరికొందరికి ఈ కేసులో పద్దెనిమిది నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. త్రిమూర్తులకు జైలు శిక్షతో పాటు రూ. 2.50 లక్షల జరిమానాను కూడా విధించింది. తోట త్రిమూర్తులు ప్రస్తుతం మండపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో విశాఖ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆయనకు ఇబ్బంది కలిగించేలా ఉంది. అయితే రెండు ఏళ్ల లోపు శిక్ష కావడంతో కాస్త ఊరట లభించింది అనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement