Sunday, April 28, 2024

AP: వైసీపీ నాయకుల అక్రమార్జనకు అడ్డాలుగా ఇసుక రీచ్ లు.. జేసీ ప్రభాకర్ రెడ్డి

యల్లనూరు, పిబ్రవరి 8 (ప్రభ న్యూస్): ప్రకృతి వనరులను దోచుకొని దాచుకోవడమే వైకాపా ప్రభుత్వ పెద్దలు పనిగా పెట్టుకున్నారని, ఇసుక రీచులు వారి అక్రమార్జనకు అడ్డాలుగా మిగులుతున్నాయని తాడిపత్రి మున్సిపల్ చెర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపులో భాగంగా గురువారం యల్లనూరు మండలం తిరుమలాపురం గ్రామ సమీపంలో వున్న చిత్రావతి నదిలో అనుమతులు లేకుండా అనధికారికంగా తరలిపోతున్న ఇసుక రీచ్ ను తాడిపత్రి మున్సిపల్ చెర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు శ్రీనివాసులరెడ్డి మోహన్ నాయుడు, కులశేఖర్ రెడ్డి, సుబ్బరాయుడు, రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, పెద్దిరెడ్డి, రత్నమయ్య, తదితర పార్టీ కార్యనిర్వహక కార్యదర్శలు పరిశీలించారు.

జేసీ ప్రభాకర్ రెడ్డితో కలిసి ఇసుక రీచ్ వద్ద ధర్నా చేస్తారని తెలిసి ముందురోజు ఇసుక రీచ్ ను ఆపేయడం జరిగింది. అయినా తాడిపత్రి మున్సిపల్ చెర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండల రైతుల పిలుపు మేరకు ఇసుక రిచ్ ప్రాంతాన్ని పరిశీలించి ఇసుక అక్రమ తరలింపుపై వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేపై మండిపడ్డారు. ఈ సందర్బంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… భవన నిర్మాణాలకు ట్రాక్టర్ ఇసుక ఇవ్వకుండా కార్మికులకు ఉపాధిని దూరం చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పేదలకు ఇసుక కష్టాలు తప్పడం లేదని, అదే వైకాపా నాయకులకు మాత్రం దోపిడీకి దారులు తెరవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

సామాన్యులకు ట్రాక్టర్ ఇసుక లేదు…

- Advertisement -

సామాన్యులు ట్రాక్టర్ ఇసుకను తరలిస్తే చట్టాలతో చుక్కలు చూపే పోలీసులు, పెద్దలు దర్జాగా పట్టపగలు పెద్దపెద్ద యంత్రాలతో, టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నా వారి కళ్ళకు కనిపించకపోవడం, చెవులకు వినిపించకపోవడం చూస్తే న్యాయస్థానాల్లో న్యాయదేవతకు నల్ల రిబ్బన్ కట్టిన చందంగా ఉందన్నారు.

ఇసుక తరలింపు చూసి రైతుల ఆవేదన..

రీచ్ పరిశీలనలో భాగంగా ఇసుక తరలింపు చూసిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నదికి ఇరువైపులా పలు గ్రామాల రైతుల బోరు బావులు వందల కొద్ది వున్నాయి. రానున్న వేసవిలో త్రాగునీటితో పాటు సాగునీటి కష్టాలు నెలకొనే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇసుక రీచ్ లను సందర్శించాలని డిమాండ్ చేశారు. ఇసుక దందా చేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అక్రమ రీచ్ లతో నదిలో రైతులు తోటలకు గ్రామాలకు త్రాగునీటి కోసం ఏర్పాటు చేసుకొన్నా పి వి సి పైపు లైన్ లు సైతం ధ్వంసం చేస్తున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రమణారెడ్డి, నారాయణ స్వామి, భైరవ, రామక్రిష్ణ, పుట్లూరు, యల్లనూరు మండలాల రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement