బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాను తీరం దాటింది. ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి ఉత్తరంగా 20 కిలోమీటర్ల దూరంలో తీరం దాటింది. నీతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తుపాను ప్రభావంతో అనేక చోట్ల అత్యధికంగా వర్షపాతం నమోదైంది. పలు చోట్ల విద్యుత్తు సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో..పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపధికన చర్యలు చేపట్టారు.
విశాఖపట్నం నగరంతోపాటు చుట్టుపక్కల మండలాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. తుపాను పరిస్థితిపై ప్రధాని మోదీ సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్లతో ఆయన మాట్లాడారు. గులాబ్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో విపత్తు సహాయ దళాలను మోహరించారు.
తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో ఇద్దరు మత్స్యకారులు తుపాను గాలుల్లో చిక్కుకుని మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో 61 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తీర ప్రాంత ప్రజలను అక్కడికి తరలించారు.