Monday, May 20, 2024

AP: నోటుకు పోస్ట‌ల్ బ్యాలెట్.. ఏపీలో నలుగురు అరెస్ట్..

యుపిఐ ద్వారా ఉద్యోగుల‌కు న‌గ‌దు ట్రాన్స్ ఫ‌ర్
వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వార్నింగ్
మొత్తం 4.3 ల‌క్ష‌ల పోస్ట‌ల్ బ్యాలెట్స్
ఇప్ప‌టికే మూడు ల‌క్ష‌ల మందికి పైగా పోలింగ్
నేడు, రేపు కూడా పోస్ట‌ల్ బ్యాలెట్స్ వేసే అవ‌కాశం …

అమ‌రావ‌తి – ఏపీలో ఎన్నికల పోలింగ్ కు మరో అయిదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో హోం ఓటింగ్ పూర్తి కాగా.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగుల ఓటింగ్ కొనసాగుతోంది. అయితే ఇందులో ఉద్యోగులు చాలా చోట్ల ఓటుకు నోటు తీసుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. దీనిపై రాజకీయ పార్టీల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఉద్యోగుల ఓటుకు నోటు వ్యవహారంపై ఈసీ ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప‌శ్చిమంలో న‌లుగురు అరెస్ట్…
పశ్చిమ గోదావరిలో నగదు పంపిణీ చేస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా. యూపీఐ ద్వారా కొంతమంది ఉద్యోగులకు నగదు పంపిణీ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఈవో తెలిపారు. ఏపీలో చాలా మంది ఉద్యోగులు ఓటుకు నోటు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇవాళ తెలిపారు. ఇది చాలా దారుణమ‌న్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలిపారు. నగదు తీసుకోవాలనుకునే ఉద్యోగులకు ఆయన తీవ్ర హెచ్చరికలు చేసారు. కాల్ డేటా రికార్డు, బ్యాంక్ అకౌంట్ ఆధారంగా ఆయా ఉద్యోగులను సస్పెండ్ చేస్తామని సీఈవో హెచ్చరించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవన్నారు.

- Advertisement -

కాగా, పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేసేందుకు 3.2 లక్షల మంది ఉద్యోగులకు అనుమతి ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. హోం ఓటింగ్ కు 28వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. అత్యవసర సర్వీసులు కింద 31,000మందికి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. పోలీసులు 40 వేలు కూడా కలుపుకుంటే 4.3 లక్షల మంది ఇలా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తున్నట్లు మీనా పేర్కొన్నారు. ఇందులో 3 లక్షల 3 వేల మంది ఇప్పటివరకూ ఓటు వేశారని ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. పలు కారణాలతో ఓటు వేయలేని వారి కోసం నేడు ,రేపు కూడా మరో అవకాశం ఇచ్చామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement