Tuesday, May 7, 2024

పోలవరం బకాయిలు 2,087 కోట్లు.. పీపీఏ సిఫార్సు చేసింది 711 కోట్లు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ :  పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా కేంద్రం రూ. 2,087 కోట్ల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా, పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ రూ. 711 కోట్లు విడుదల చేసేందుకు మాత్రమే సిఫార్సు చేసిందని కేంద్ర జలశక్తి శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు రాజ్యసభకు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనుల కోసం ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును తిరిగి చెల్లించే విషయంలో అసాధారణ జాప్యం జరుగుతోందని, దీనిని నివారించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు.

బిల్లుల స్క్రూటినీలో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనపు సమాచారం కోరవలసి రావడం, నియమ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అనుసరిస్తోందా లేదా వంటి అంశాల నిర్ధారణ చేసుకోవడం వంటి పలు కారణాల వల్ల బకాయిల చెల్లింపులలో జాప్యం జరుగుతున్నట్లు మంత్రి వివరించారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఇరిగేషన్‌ విభాగం పనులకు సంబంధించిన ఖర్చును 2014 ఏప్రిల్‌ నుంచి తిరిగి చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలవరం పనుల బిల్లులను పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలించిన అనంతరం చెల్లింపుల కోసం సిఫార్సు చేస్తుందని తెలిపారు.

వాటిని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపిస్తామని, ఆర్ధిక శాఖ ఆమోదం పొందిన అనంతరం ఎంత మొత్తం బకాయిల చెల్లింపునకు ఆమోదం లభిస్తే ఆ మేరకు నిధులను నాబార్డ్‌ మార్కెట్‌ నుంచి సేకరిస్తుందని వివరించారు. మార్కెట్‌ నుంచి నిధుల సేకరణ  ప్రక్రియ పూర్తి కావడానికి సాధారణంగా రెండు నుంచి మూడు వారాలు పడుతుందని, సేకరించిన నిధులను నాబార్డ్‌ నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీకి అక్కణ్ణుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి బదిలీ అవుతాయని తెలిపారు. నిధుల బదిలీ ప్రక్రియ సాధారణంగా ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతుందని మంత్రి వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement