Thursday, April 25, 2024

పాపికొండల విహారం షురూ.. మూడు నెలల తర్వాత పున:ప్రారంభం

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రకృతి అందాల మధ్య గోదావరి నదిపై పడవ ప్రయాణం మళ్లీ మొదలైంది. గోదావరికి వరదలు తగ్గడంతో పాపికొండల విహార యాత్రను మళ్లీ ప్రారంభించేం దుకు ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ అనుమతిచ్చింది. పర్యాటక శాఖ అనుమతుల నేపధ్యంలో గోదావరి అలలపై సాగే బోటు ప్రయాణం మొదలయ్యింది. దేవీపట్నం మండలం పోచమ్మ గండి ఆలయం నుండి పాపికొండలు విహార యాత్రను ఆదివా రం అధికారులు ప్రారంభించారు. ఇటీవలి వరదలకు సుమారు మూడు నెలల పాటు పాపికొండల యాత్రను అధికారులు నిలిపేశారు.

ప్రస్తుతం నదిలో నీటి మట్టం తగ్గడంతో యాత్రను మళ్ళీ అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు ప్రభుత్వ బోట్లలో సుమారు 100 మంది పర్యాటకులను రక్షణ చర్యలు తీసుకొని పాపికొండల తీరం దర్శించడానికి ఉదయం పయనం అయ్యాయి. అధికారులు పర్యవేక్షణలో పర్యాటకులు ఉత్సాహంగా వెళ్లారు. మూడు నెలల తర్వాత గండిపోచమ్మ బోట్‌ పాయింట్‌ వద్ద మళ్ళీ పర్యటక సందడి వాతావరణం నెలకొంది. పాపికొండల విహార యాత్రకు ముందు అధికారులు గోదావరిలో బోట్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. గండిపోశమ్మ ఆలయం వద్ద పర్యాటకులు బోటెక్కడానికి వీలుగా పంటు ఏర్పాటు చేశారు. పోచమ్మగండి వద్ద బోట్ల పర్యాటక ప్రాంతాన్ని శుభ్రం చేయించారు.

దీంతో రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సంక్రాంతి తర్వాత పాపికొండల యాత్రను నిలిపేసేవారు. నదిలో నీటిమట్టం తగ్గడంతో ఇసుక దిబ్బలకు తగిలి బోట్లు మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఉండడంతో యాత్రను ఆపేవారు. అయితే పోలవరం వద్ద ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంతో పాపికొండల్లో గోదావరి నీటిమట్టం బాగా పెరిగింది. దీంతో వేసవిలోనూ కొనసాగించాలని ఈ ఏడాది మొదట్లోనే అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో సంక్రాంతి తర్వాత సైతం పాపికొండలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement