Monday, April 29, 2024

ఏపీలో మెరుగైన విద్యుత్ వ్యవస్థ.. రూ. రూ.3897.42 కోట్లతో పనులు

ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందించాలంటే ఎపి ట్రాన్స్ కో పటిష్టంగా ఉండాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సచివాలయంలోని మూడో బ్లాక్ లో విద్యుత్ ట్రాన్స్ కో అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డిస్కంలకు విద్యుత్ ను సరఫరా చేయడంలో ట్రాన్క్ కో సమర్థవంతమైన నెట్ వర్క్ తో పనిచేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్క్ కో ఆధ్వర్యంలో నూతన విద్యుత్ లైన్లు ఏర్పాటు, పంపిణీ వ్యవస్థలో భాగంగా సబ్ స్టేషన్ల నిర్మాణం, డెడికేటెడ్ కేబుల్స్, టవర్స్ నిర్మాణం పనులను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 కెవి సామర్థ్యం కలిగిన 16 సబ్ స్టేషన్లు, 220 కెవి సామర్థ్యం ఉన్న 103 సబ్ స్టేషన్లు, 132 కెవి సామర్థ్యం ఉన్న 232 సబ్ స్టేషన్లు ఉన్నాయని, వాటి ద్వారా డిస్కం లకు విద్యుత్ సరఫరా జరుగుతోందని అన్నారు. మొత్తంగా 351 సబ్ స్టేషన్ల ద్వారా ట్రాన్క్ కో నుంచి డిస్కంలకు విద్యుత్ సరఫరా జరుగుతోందని తెలిపారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.223.47 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. 

గ్రీన్ ఎనర్జీ కారిడార్ కోసం రూ.941.12 కోట్లతో పనులు జరుగుతున్నాయని, విశాఖపట్నం-చెన్నై కారిడార్ లో రూ.605.56 కోట్ల మేర పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. మూడు జోన్ లలో సిస్టమ్ ఇంప్రూవె మెంట్ లో భాగంగా రూ.762.53 కోట్ల పనులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే 400 కెవి సామర్థ్యంతో కూడిన విద్యుత్ సరఫరా కోసం రూ.1257.56 కోట్లతో పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.3897.42 కోట్లతో ట్రాన్స్ కో ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఆయా పనులకు సంబంధించి ప్రతిఏటా ఎస్ఎస్ఆర్ రేట్లపై రివిజన్ జరగాలని సూచించారు. ఇందుకోసం వెంటనే కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాకుండా ట్రాన్స్ కో చేపట్టిన పనులకు గాన అటవీశాఖ క్లియరెన్స్ ల కోసం పనుల్లో ఎటువంటి జాప్యం లేకుండా నోడల్ ఆఫీసర్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇఎపి కింద చేపట్టిన ప్రాజెక్ట్ లను సకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేయాలని కోరారు. నిధుల లభ్యత, పనుల పురోగతిలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని సీఎం శ్రీ వైయస్ జగన్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఓవర్ లోడింగ్, లో ఓల్టేజీ సమస్యలను పూర్తిస్థాయిలో నియంత్రించాలని, దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement