Thursday, May 16, 2024

Mallavalli Food Park: సకల సదుపాయాల కల్పవల్లి.. మెగా ఫుడ్ పార్క్@ మల్లవల్లి

రైతులకు అందుబాటులోకి కృష్ణాజిల్లా మల్లవల్లి మెగాఫుడ్‌ పార్కుకు రానున్న మామిడి పళ్ల సీజన్‌ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ప్రణాళిక సిద్ధం చేసింది. రైతులకు ఫుడ్ పార్కును అందుబాటులోకి తీసుకురావాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాన్ని త్వరలో సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ముడి పదార్థం నుంచి గుజ్జు, పండ్ల రసాలు తీసి ప్యాకింగ్‌ చేసి ఎగుమతి చేసుకునేలా భారీ కోర్ ప్రాసెసింగ్‌ సెంటర్‌ (సీపీసీ)ను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి వెల్లడించారు. 57.95 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ మెగా ఫుడ్‌ పార్కును రూ.112.94 కోట్లతో అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు. సుమారు  7.48 ఎకరాలలో రూ. 86 కోట్లతో మెగా ఫుడ్ పార్కు పరిధిలో సీపీసీ(కోర్ ప్రాసెసింగ్ సెంటర్)ని కూడా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. అన్ని రకాల పండ్ల రసాలు, పొడులు, నూకలకు కావాల్సిన పరిమాణంలో ప్యాకింగ్, ఆహార నాణ్యతను పరిశీలించే ల్యాబ్‌లను ఈ సీపీసీలో నెలకొల్పారన్నారు.

మల్లవల్లి ఫుడ్ పార్కులో ఏర్పాటైన కోర్ ప్రాసెసింగ్ సెంటర్ పనితీరుపై చేసిన ప్రయోగాలు విజయవంతంతో ఏప్రిల్  కల్లా ఈ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా ఏపీఐఐసీ అడుగులు వేస్తోంది. ఈ ఫుడ్‌పార్క్‌ పనులు సహా సీపీసీని పరిశీలించేందుకు ఛైర్మన్ నేతృత్వంలోని ఏపీఐఐసీ బృందం గత వారం పరిశీలించింది. అలాగే, దీనిపక్కనే ఏపీఐఐసీ 42.55 ఎకరాల్లో మరో ‘స్టేట్‌ ఫుడ్‌పార్క్‌’ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఏర్పాటుచేసే యూనిట్లు కూడా ఈ సీపీసీ సౌకర్యాలను వినియోగించుకునేలా తీర్చిదిద్దింది. ఈ రెండు పార్కుల ద్వారా సుమారు రూ. 260కోట్ల పెట్టుబడులు, 6 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.

మల్లవల్లి మెగా ఫుడ్‌పార్క్‌లోని కోర్ ప్రోసెసింగ్‌ సెంటర్‌ సౌకర్యాలను రైతులకు, పెట్టుబడిదారులకు తెలియజేయడానికి త్వరలోనే రోడ్‌ షో నిర్వహించనున్నట్లు ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది వెల్లడించారు. ముడి సరుకును తీసుకొచ్చి వారికి కావాల్సిన పరిమాణంలో శుద్ధిచేసిన ఉత్పత్తులను తీసుకువెళ్లేలా ఇందులో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. మామిడి, టమోటా, బొప్పాయి, జామ, అరటి పండ్లతో పాటు వివిధ ఆహార ధాన్యాలను ప్రాసెస్‌ చేసి ప్యాకింగ్‌ చేసి తీసుకెళ్లవచ్చని ఎండీ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పార్క్‌లో యూనిట్లు ఏర్పాటుచేయడానికి కొన్ని సంస్థలు ముందుకొచ్చాయని, మరికొన్ని సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి అనుమతితో ఏప్రిల్ లో రోడ్ షో నిర్వహించే తేదీ వివరాలు ఖరారు చేస్తామని ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement