Friday, May 17, 2024

ఉద్యోగాలిప్పిస్తామ‌ని వ‌సూళ్లు.. నిందితుల అరెస్టు

తుళ్లూరు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని నిరుద్యోగుల‌ను మోసం చేస్తూ.. న‌కిలీ అప్పాయింట్ మెంట్ ఆర్డ‌ర్లు చూపిస్తూ డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న నిందితుల‌ను గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. క్లర్క్ ఉద్యోగాలు వచ్చాయని, నకిలీ కాల్ లెటర్స్ ను సృష్టించిన వ్యక్తులను మంద‌డం శివార్ల‌లో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. తుళ్లేరు సీఐ దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల హైకోర్టు డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ కె. ఎస్.వి. ప్రసాద్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో భాగంగా రాజమండ్రికి చెందిన యల్లా ఉమామహేశ్వరరావు, పోనంగి సత్యసాయి చక్రధర్ మరికొందరు కలిసి ఉద్యోగాలు ఇప్పిస్తామని, నకిలీ ఆర్డర్ తయారుచేసి వారికి చూపించి డబ్బు వసూలు చేశారని తెలిపారు. డీఎస్పీ పోతురాజు ఆదేశాల మేరకు సీఐ దుర్గా ప్రసాద్ కు అందిన ఖచ్చితమైన సమాచారంతో ఎస్సై శ్రీహరి, సిబ్బంది మందడం గ్రామ శివార్లలో ముద్దాయిలను గుర్తించి అరెస్ట్ చేశారు. ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఇంకా కొంతమంది ముద్దాయిలను అరెస్టు చేయాల్సి ఉంద‌న్నారు. చాకచక్యంగా ముద్దాయిలను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సీఐ దుర్గా ప్రసాద్, ఎస్సై శ్రీహరి , సిబ్బందిని డీఎస్పీ పోతురాజు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement