Tuesday, April 30, 2024

కిక్కెక్కనున్న టూరిజం… టూరిస్టు ఏరియాల్లో హరిత హోటల్స్, రెస్టారెంట్లు..

గత రెండేళ్లుగా ప్రకృతి ప్రకోపంతో నష్టాలు చవిచూస్తున్న పర్యాటక శాఖను గాడిన పెట్టేందుకు ఆ శాఖ అధికారులు ఆదాయ మార్గాలపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా పర్యాటక ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై ఆ శాఖ దృష్టిసారించింది. ఎక్సైజు శాఖతో నిమిత్తం లేకుండా నేరుగా మద్యం అమ్మకాలు చేపట్టడంపై ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఓ వైపు హరిత హోటల్స్‌, రెస్టారెంట్లు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తున్న తరుణంలో మద్యం అమ్మకాల ప్రతిపాదన చర్చనీయాంశంగా మారింది. కోవిడ్‌-19 మొదటి, రెండు దశల్లో నెలకొన్న పరిస్థితుల వ‌ల్ల అన్ని పర్యాటక ప్రాంతాలను మూసేయడంతో పర్యాటక రంగం ఆర్థికంగా కుధేలైంది. పైగా నిర్వహణ లేక పర్యాటక ప్రాంతాలు పూర్తిగా పాడైపోయాయి. వివిధ రూపాల్లో పర్యాటక రంగం రూ.150 కోట్ల మేర నష్టాన్ని చవి చూసినట్లు అధికారులు చెపుతున్నారు. కొద్ది రోజుల కిందట పాపి కొండల విహార యాత్రను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం.. ఆయా ప్రాంతాలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు రూ.30 కోట్లు మంజూరు చేసింది.

పర్యాటకులు అధికంగా వచ్చే కీలక ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు చేపట్టనున్నారు. ఇదే సమయంలో హరిత హోటల్స్‌, రెస్టారెంట్లలో కూడా మద్యం అమ్ముతారు. ఇప్పటికే 300 ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా గుర్తించారు. ఇకపై ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాల్లో నేరుగా సంబంధిత అధికారులే అమ్మకాలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఆయా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు ఉన్న అవకాశాలను కూడా ఆ శాఖ పరిశీలిస్తోంది. పర్యాటకులు అధికంగా రావడంతో పాటు మద్యం కొనుగోళ్లు చేయాలంటే బస చేయాల్సిన అవసరం ఉంది. హోటల్స్‌ ఉన్న ప్రాంతాలు అనువైనప్పటికీ ఇతర ప్రాంతాల్లో ఆ దిశగా చర్యలు తీసుకోనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement