Friday, April 26, 2024

తాడిపత్రిలో జేసీ వింత ప్రవర్తన.. అధికారుల తీరుపై నిరసన

తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య ఆధిపత్య పోరుతో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. మున్సిపల్‌ ఛైర్మన్‌ హోదాలో అధికారులు, సిబ్బందితో తాను సమావేశం ఏర్పాటు చేస్తే మూకుమ్మడిగా అంతా గైర్హాజరు కావడంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మొదట మున్సిపల్ కార్యలయంలోనే రాత్రంతా బస చేశారు. అక్కడే స్నానం కూడా చేసిన నిరసన తెలిపారు. మున్సిపల్ అధికారులు కార్యాలయం నుంచి బయటకు వస్తుంటే వారికి ఒంగి నమస్కారం పెట్టారు. ఇలా వింత ప్రదర్శనలతో జేసీ మరోసారి వార్తల్లో నిలిచారు..

సోమవారం ఉదయం 10.30 గంటలకు సిబ్బందితో సమీక్షా సమావేశం ఉంటుందని కమిషనర్‌తో సహా అందరికీ శనివారమే ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. అదే సమయానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్‌ సిబ్బందితో కలిసి కరోనా వైరస్‌ మూడో దశపై అవగాహన ర్యాలీ, సమీక్షా సమావేశం నిర్వహించడంతో అధికారులకు సందిగ్ధ పరిస్థితి ఎదురైంది. ర్యాలీ అనంతరం కార్యాలయానికి వస్తారనే ఉద్దేశంతో 12.30 గంటలకు ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌన్సిలర్లతో కలిసి కమిషనర్‌ ఛాంబర్‌లో ఎదురు చూస్తూ కూర్చున్నారు. మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది ఎమ్మెల్యేతో సమీక్ష ముగిసిన అనంతరం అటు నుంచి అటే ఇళ్లకు వెళ్లిపోవడం, కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి మధ్యాహ్నం నుంచి సెలవుపై వెళుతూ ఇతరులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలియడంతో ఛైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కార్యాలయానికి వచ్చే వరకు కదిలేది లేదని కార్యాలయంలోనే భీష్మించుకు కూర్చున్నారు. సాయంత్రం 4.30 గంటలకు కొందరు అధికారులు రాగానే వారి నిబద్ధతను మెచ్చుకుంటున్నట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రదర్శించిన హావాభావాలకు అధికారులు సమాధానం చెప్పలేని స్థితిలో పడిపోయారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కమిషనర్‌ సెలవుపై ఎలా వెళతారని, ఛైర్మన్‌ ఆదేశాలను కాదని సిబ్బంది ఎలా గైర్హాజరవుతారని ప్రశ్నిస్తూ.. 26 మందికి తాఖీదులు జారీ చేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. కమిషనర్‌ వచ్చేదాకా రాత్రి కూడా కార్యాలయంలోనే బస ఏర్పాటు చేసుకుంటామని ఛైర్మన్‌ పేర్కొనడంతో పరిస్థితి రసవత్తరంగా మారింది. ఆ మేరకు ఆయన రాత్రి అక్కడే భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.

తాడిపత్రి పురపాలిక కార్యాలయ సిబ్బంది 26 మంది కనిపించడం లేదంటూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డి సోమవారం రాత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘’  సోమవారం సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పురపాలిక కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డితో పాటు పురపాలిక ఉద్యోగి చాంద్‌బాషాకు శనివారం సమాచారం ఇచ్చాం. పురపాలిక వాట్సాప్‌ గ్రూప్‌లో సందేశాన్ని పంపాము. సోమవారం ఉదయం సమావేశ సమయానికి వచ్చి చూడగా 26 మంది ముఖ్యమైన అధికారులతో పాటు సిబ్బంది విధుల్లో కనిపించలేదు. హాజరు పట్టికలో వారి సంతకాలు లేవు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కమిషనర్‌ సెలవులో ఉన్నారని, ఆయన స్థానంలో రాజేశ్వరిబాయి ఇన్‌ఛార్జిగా ఉంటారనే సమాచారం వచ్చింది. ఇటీవల పురపాలిక అధికారులు టెంకాయలు విక్రయించే వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంలో పురపాలిక అధికారులకు, ఉద్యోగులకు ఎవరైనా హాని తలపెట్టి ఉంటారేమోనని ఆందోళన చెందుతున్నాం. వారి ఆచూకీ కనుగొని రక్షించాలి‘’ జేసీ ప్రభాకరరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement