Monday, April 29, 2024

Janasenani – అంగన్వాడీల దీక్ష భగ్నం – జగన్ పై పవన్ కల్యాణ్ గరం గరం….

విజయవాడ ధర్నా చౌక్ లో అంగన్వాడీలు చేపట్టిన నిరాహాక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అంగన్ వాడీలతో చర్చలు జరపకుండా ఈడ్చి వేయడం సరికాదని అన్నారు. ఇది అప్రజాస్వామికం అని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నలభై రెండు రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రజాస్వామ్యయుతంగా లేదని అన్నారు. నామ మాత్రపు వేతనాలతో సేవలందిస్తున్న మహిళలతో సామరస్యపూర్వకంగా చర్చలు జరపకుండా, విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం, పోలీసు చర్యలకు దిగటం పాలకుల ధోరణిని ఏంటో తెలియజేస్తోందని పేర్కొన్నారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డికి కోటి సంతకాలతో కూడిన వినతి పత్రం ఇచ్చేందుకు ఛలో విజయవాడ కార్యక్రమం చేపడితే అర్థరాత్రి సమయంలో పోలీసులు అంగన్ వాడీ మహిళలను ఈడ్చి వేయడాన్ని తాము ఖండిస్తున్నామని జనసేన చీఫ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బందిని అరెస్టులు చేయడం వారి కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. విజయవాడలో అంగన్వాడీ సిబ్బందిని అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, వారిని పోలీసు వాహనాల్లోకి ఎక్కించడాన్ని ఖండిస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు.

ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేశారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఆ సమయంలో పొరుగు రాష్ట్రాల కంటే వెయ్యి రూపాయల ఎక్కువ జీతం ఇవస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అయితే దానిని అమలు చేయాలని అంగన్ వాడీ సిబ్బంది కోరుతున్నారని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ విధానాన్ని వర్తింపజేయాలని అంగన్ వాడీ సిబ్బంది కోరుతున్నారని చెప్పారు. చిరుద్యోగుల విషయంలో సానుకూలంగా ఆలోచించాలని పవన్ కల్యాణ్ కోరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement