Sunday, May 5, 2024

Janasena – పొత్తుతోనే పోరాటం – ఎత్తుల గురించి త్వరలో ప్రకటిస్తాం : నాగబాబు

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) : వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీచేయడం ఖాయం. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు.. ఎవరు మాతో ఎవరు కలిసివస్తారు.అనే విషయాలను త్వరలోనే వెల్లడిస్తాం. ఇక సి ఏం అభ్యర్థి ఎవరనే విషయంలో ఎన్నికల తరువాత కలిసి చర్చించుకుని నిర్ణయించుకుంటాం. ” అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ వర్గాలతో నిర్వహించిన రెండు రోజుల ముఖాముఖీ కార్యక్రమం ముగిసిన నేపథ్యంలో ఆయన ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా నాగబాబు మాట్లాడుతూ అరాచక వైకాపా ప్రభుత్వాన్ని ఓడించడానికి భావ సారూప్యత కలిగినవారితో కలిసిపోరాడాలని ముందే అనుకున్నా చంద్రబాబు ను అరెస్టు చేసిన తీరు చూసిన తరువాతనే తెలుగుదేశం పార్టీ తో కలిసి పోటీ చేయాలని తమ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారని గుర్తు చేసారు. చంద్రబాబు ను అక్రమంగా అరెస్టు చేసిన తీరు తో పవన్ తీసుకున్న నిర్ణయానికి తమ పార్టీ లో 99 శాతం మంది మద్దతు ఇస్తున్నారన్నారు. ఇతర కారణాలతో మద్దతు ఇవ్వని 1 శాతం గురించి పట్టించుకోబోమని స్పష్టం చేసారు. పొత్తు లో భాగంగా ఎవరికీ ఎన్ని సీట్లు, ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు.. బి జె పి పొత్తులో ఉంటుందా లేదా అని అడిగిన ప్రశ్నలన్నిటికీ త్వరలోనే జవాబులు లభిస్తాయని చెప్పారు.
తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా అనే ప్రశ్నకు కూడా త్వరలో తెలుస్తుందన్నారు. అధికార పార్టీ లో లాగా కోట్ల రూపాయలు వెదజల్లి అక్రమాలతో గెలవాలని యత్నించే నాయకులు తమ పార్టీ కి లేకున్నా రాష్ట్ర భవిష్యత్తు గురించి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే బలమైన కార్యకర్తలు ఉన్నారని, ప్రజలు వారిని గెలిపించుకుంటారని నాగబాబు ధీమా వ్యక్తం చేసారు. త్వరలో రాయలసీమ లో వారాహి యాత్ర ఉంటుందని మరో ప్రశ్నకు జవాబుగా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement