Sunday, April 28, 2024

AP: మోసానికే బ్రాండ్ అంబాసిడర్ జగన్.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి… షర్మిల

జ‌గ‌న్ అంటే మోసానికే బ్రాండ్ అంబాసిడ‌ర్ అని, ఆయ‌న పాల‌న‌లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని రాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల అన్నారు. ఏపీ సీఎం జగన్ పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. జాబు కావాలంటే బాబు రావాలని చంద్రబాబు గతంలో మోసం చేశారని… ఇప్పుడు జాబు రావాలంటే జగన్ కావాలని జగన్ రెడ్డి ఘరానా మోసానికి తెర లేపారని దుయ్యబట్టారు. 2.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 23 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని గద్దెనెక్కిన వీరు ఈ ఐదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.

ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, జంబో డీఎస్సీ, ఎపీపీఎస్సీ నుంచి వరుస నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి, నిరుద్యోగులను నమ్మించి నిండా ముంచారని దుయ్యబట్టారు. మోసానికే బ్రాండ్ అంబాసడర్ జగన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ అవసరాల కోసం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి 2 లక్షల ఉద్యోగాలను ఇచ్చామని చెప్పుకోవడం తప్ప… గౌరవంగా చెప్పుకునే ఒక్క ఉద్యోగాన్నైనా భర్తీ చేశారా అని ప్రశ్నించారు. ఇప్పటికే వివిధ శాఖల పరిధిలో 2.25 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని… ఇది జగన్ మార్క్ పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement