Saturday, April 27, 2024

ONGC – జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు నిధులు విడుద‌ల చేసిన జ‌గ‌న్

తాడేప‌ల్లి – ఓఎన్జీసీ పైపులైన్‌ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు వర్చువల్‌గా డబ్బు విడుదల చేశారు ఎపి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ .. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారు. కాగా, భారీ వర్షాల కారణంగా సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ్టి సూళ్లూరుపేట నియోజకవర్గం పర్యటన వాయిదా పడింది.. అయితే, సూళ్లూరుపేట వేదికగా తలపెట్టిన కార్యక్రమాన్ని తాడే ప‌ల్లి నుంచి కొనసాగించారు.


ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలో జరుపుకోవాలని అనుకున్నాం. వర్షాల తాకిడి వల్ల అక్కడికి చేరుకొనే పరిస్థితి లేక పోస్ట్ పోన్ చేసుకున్నాం. కానీ, మనం ఇవ్వాలనుకున్న, చేయాలనుకున్న ఆర్థిక సాయం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఓఎన్జీసీ పైపు లైన్ ద్వారా నష్టపోతున్న మత్స్యకారులందరికీ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు వద్ద పులికాట్ సరస్సు ముఖద్వారాన్ని పూడిక తీసి, తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకున్నాం. ఆ కార్యక్రమం వీలునుబట్టి ఈ నెలాఖరులోనో, వచ్చే నెలలోనో చేపడతామని ప్రకటించారు సీఎం వైఎస్‌ జగన్‌.

మరోవైపు, ఓఎన్జీసీ పైపులైన్ నిర్మాణం వల్ల, జరుగుతున్న తవ్వకాల వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 16,408 మంది మత్స్యకారుల కుటుంబాలకు, కాకినాడ జిల్లాలో మరో 7 వేల 50 మంది, మొత్తంగా 23,458 మంది మత్స్యకారుల కుటుంబాలకు కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తున్నాం అని తెలిపారు సీఎం జగన్‌.. నెలకు రూ.11,500 చొప్పున చెల్లించే ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీతో మాట్లాడాం.. వారి తరఫున ఓఎన్జీసీతో మాట్లాడి 3 దశల్లో 323 కోట్లు నష్టపరిహారం ఇప్పటికే ఇప్పించాం. 4వ విడత ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రూ.161 కోట్లు పరిహారం ఈరోజు ఇక్కడి నుంచి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమం జరుగుతోందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement