Tuesday, April 30, 2024

AP: ఎవరికి లాభం చేకూర్చేందుకు షర్మిల కాంగ్రెస్‌లో చేరారో చెప్పాలి.. మంత్రి రోజా

ఎవరికి మేలు చేయాలనే ఉద్దేశంతో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారో చెప్పాలని ఏపీ మంత్రి రోజా అన్నారు. వైఎస్ షర్మిలపై మంత్రి రోజా మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. విశాఖలో ఆడుదాం.. ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను జైలు పాలు చేసిన పార్టీతో షర్మిల చేతులు కలిపారని మంత్రి రోజా ఆరోపించారు. తెలంగాణ నుంచి రావాల్సిన రూ.6వేల కోట్లు, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీకి రావాల్సిన రూ.లక్షా 8 వేల కోట్లు రాబట్టాలని షర్మిలకు మంత్రి రోజా సలహా ఇచ్చారు.

రాష్ట్ర వాటాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ను, కాంగ్రెస్ అధినేత్రి సోనియాను షర్మిల ప్రశ్నించాలని సూచించారు. చంద్రబాబు, పవన్, షర్మిల నాన్ లోకల్ పొలిటీషియన్లు అని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల తర్వాత వాళ్లంతా తెలంగాణకు పారిపోతారని మంత్రి రోజా విమర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సింహంలాంటి వ్యక్తి అని, ఎన్నికలకు సింగిల్‌గానే వెళ్తారని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement