Tuesday, April 30, 2024

గ్రీన్‌ ఎనర్జీ రంగంలో పెట్టుబడుల వెల్లవ! 9.57 లక్షల కోట్ల పెట్టుబడుకు 42 ఎంవోయూలు

అమరావతి, ఆంధ్రప్రభ: గ్రీన్‌ ఎనర్జీ రంగంలోకి పెట్టుబడులు వెల్లువెత్తడంతో, భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌ వేగంగా అభివృద్ధి చెందబోతోంది. ఈనెల 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్‌ ఇన్వస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ వేదికగా ఇంధన రంగంలో దాదాపు రూ. 42 అవగాహన ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసింది. వీటిద్వారా రూ. 9.57 లక్షల కోట్ల పెట్టుబడులతో దాదాపు 1.8 లక్షల మందికి ఉపాధి అవకాశాలను సృష్టించే అవకాశం ఏర్పడనుంది. దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలు రిలయన్స్‌ ఇండియా లిమిటెడ్‌, అదానీ గ్రీన్‌ మొదలైనవి కూడా ఏపీలో పెద్ద ఎత్తున గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులను స్థాపించడానికి ముందుకు వచ్చాయి.

ప్రపంచ ప్రమాణాల ప్రకారం 24/7 విద్యుత్‌ సరఫరాను బలోపేతం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి ఇది ఉపయోగపడనుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ధృడమైన ప్రయత్నాలు పెట్టుబడులను ఆకర్షించడానికి కారణమయ్యాయి, ఇవి రాష్ట్రం యొక్క గ్రీన్‌ ఎనర్జీని వేగంగా పెంచడంలో సహాయపడతాయి. ఇది రాబోయే సంవత్సరాల్లో ఇంధన భద్రత, ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి, ఆర్ధిక వ్యవస్థపై ఇంధన తీవ్రతను తగ్గించడానికి, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడానికి మరియు పర్యావరణాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడనుంది.

- Advertisement -

పవన, సౌర విద్యుత్‌ తయారీకి విస్తారమైన వనరులు..

రాష్ట్రంలో సౌర మరియు పవన విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయి. పరిశ్రమలకు ప్రోత్సహక విధానం మరియు అనుకూల పర్యావరణంతో పునరుత్పాదక ఇంధనానికి రాష్ట్రం అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంది. పునరుత్పాదక ఇంధన అభివృద్ధిలో రాష్ట్రం ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పునరుత్పాదక ఎగుమతి విధానాన్ని ప్రకటించిన సంగతి విధితమే. హైబ్రిడ్‌ పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. సోలార్‌ పార్కుల అభివృద్ధి మరియు రూఫ్‌ టాప్‌ సోలార్‌ ఇన్‌స్టాలేషన్‌లను ప్రోత్సహించడం వంటి అనేక కార్యక్రమాలను కూడా రాష్ట్రం చేపట్టింది.

గ్రిడ్‌లో పునరుత్పాదక శక్తిని ఏకీకృతం చేయడంలో కీలకమైన ఇంధన నిల్వను ప్రోత్సహించడంలో కూడా రాష్ట్రం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. గత ఏడాది ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కర్నూలులో ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌ (ఐఆర్‌ఈఎస్పీ)కి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. పునరుత్పాదక ఇంధనానికి రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత, అనుకూల విధానాలు మరియు సమృద్ధిగా ఉన్న వనరులు గ్రీన్‌ ఎనర్జీ రంగంలో పెట్టు-బడులు పెట్టడానికి కారణాలయ్యాయి. ప్రముఖ భారతీయ కంపెనీలను ఆకర్షించడంతో ఏపీలో గ్రీన్‌ ఎనర్జీ రంగం భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తోంది.

విద్యుత్‌ రంగంలో స్వయం సంవృద్ధిని సాధించేలా..

భవిష్యత్‌లో ఎలాంటి ఇంధన డిమాండ్‌ వచ్చినా దాన్ని తీర్చాలని, విద్యుత్‌ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, వినియోగదారుల వృద్ధి, పట్టణీకరణ కారణంగా విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఈక్రమంలోనే ప్రభుత్వం అంతరాయాలు లేని నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరలకు అందించడానికి రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం రిలయన్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ మరియు అదానీ గ్రూప్‌కు చెందిన కరణ్‌ అదానీ వంటి భారతదేశ అగ్రశ్రేణి పరిశ్రమ యాజమాన్యాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ప్రభుత్వం విజయవంతమైంది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రాష్ట్రంలో 10 గిగావాట్ల పునరుత్పాదక సోలార్‌ ఎనర్జీ ఉత్పత్తికి పెట్టుబడి పెడతామని ప్రకటించగా, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 15 గిగావాట్ల సామర్థంతో పునరుత్పాదక ఇంధన యూనిట్లను అనంతపురం, కర్నూలు, కడప, విశాఖపట్నం మరియు విజయనగరంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఇటీవల రూ.81 వేల కోట్ల విలువైన గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం రాష్ట్రం ఇప్పటికే అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన మరియు సుస్థిర అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రంగం వృద్ధి చెందుతుందని ఇది స్పష్టంగా సూచిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement