Thursday, April 25, 2024

ఏపీ కురుక్షేత్రంలో డీబీటీ.. డీపీటీ మధ్యే యుద్ధం.. సీఎం జ‌గ‌న్

-52 లక్షల మంది రైతన్నలకు రూ. 3923.21 కోట్ల రైతు భరోసా సాయం

-కర్నూలు జిల్లా పత్తికొండలో నిధులు విడుదల చేసిన సీఎం జగన్

-మన పథకాలు.. పనులను కాపీ కొట్టిన చంద్రబాబు

-చంద్రాబాబుకు క్యారెక్టర్.. క్రెడిబిలిటీ రెండూ లేవు

ఏపీ కురుక్షేత్రంలో డీబీటీ.. డీపీటీ మధ్యే యుద్ధమ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బటన్ నొక్కి రైతుల ఖాతాలో పెట్టుబడి సహయం జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. ఆ రైతు పంట వేసే నాటి నుంచి కోత కోసే వరకు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదని అన్ని వసతులను రైతు భరోసా కేంద్రం రూపంలో సొంతూళ్లోనే ఏర్పాటు చేశామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నాడు వ్యవసాయం దండగ అని చంద్రబాబు విమర్శిస్తే.. నేడు అదే రైతన్నను రాజుగా నిలిపి వ్యవసాయాన్ని పండగలా మార్చామ‌న్నారు. విత్తనాలు మొదలు పంట కోతల అనంతరం ధాన్యాన్ని మద్ధతు ధరకు కొనుగోలు చేయడం వరకు మీ బిడ్డ ప్రభుత్వం రైతన్నల వెంటే ఉంటుందన్నారు. రైతన్నల ముఖాల్లో చిరునవ్వు చూడటమే మీ బిడ్డ లక్ష్యమ‌న్నారు. మీ ప్రేమానురాగాలకు రెండు చేతులూ జోడించి నమస్కరిస్తున్నానన్నారు.

- Advertisement -

ఏపీ కురుక్షేత్రంలో డీపీటీ.. డీబీటీ మధ్య యుద్ధం జరుగుతుందని.. మీ బిడ్డ ప్రభుత్వంలో పేదలు.. రైతన్నలకు మంచి చేయాలని చూస్తుంటే, అది భరించలేని చంద్రబాబు కడుపుమంటతో ఆ నిధులను తన బినామీలకు దోచుకో.. పంచుకో.. తినుకో.. పాలసీలో పంచి పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబు మన పథకాలు.. పనులను కాపీ కొడుతున్నారని.. వైఎస్సార్ సీపీ పథకాలన్నీ కలిపి టీడీపీ మేనిపెస్టో పేరుతో చంద్రబాబు పులిహోరా కలిపారని.. బిస్మిల్లాబాత్ చేశారని సీఎం జగన్ చంద్రబాబుపై విురుచుకుపడ్డారు. సీఎంగా పనిచేసినంత కాలం ప్రజలకు ఏం మంచి చేయలేక.. ఇప్పుడు పొత్తుల కోసం పాకులాడుతున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు క్యారెక్టర్, ఒరిజినాలిటీ రెండూ లేవని సీఎం జగన్ విమర్శించారు. 1995లోనే సీఎం అయిన చంద్రబాబు నేటికీ ఒక్క ఛాన్స్ అని అడగడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీ మేనిపెస్టో సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు కష్టాలను తడిమి చూసి.. అదే ప్రజల గుండె చప్పుడుగా పుట్టిందని భావోధ్వేగానికి లోనయ్యారు. కానీ చంద్రబాబు మెంటాలిటీ అది కాదని గెలిచే వరకు ప్రజలను బ్రతిమాలడం గెలిచిన మేనిపెస్టోను చెత్తబుట్టలో పడేసి గెలిపించిన ప్రజలను వెన్నుపోటు పొడ‌వడమేనని పేర్కొన్నారు. రైతన్నకు సేవ చేసే ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి సదా రుణపడి ఉంటానన్నారు. రైతన్న ఎక్కడా ఇబ్బంది పడకూడదనే పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
వైఎస్‌ఆర్‌ రైతు భరోసాతో అన్నదాతలకు ఎంతో మేలు జరిగిందన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని.. ప్రస్తుతం 52,30,939 మంది రైతన్నల ఖాతాల్లోకి నిధులు విడుదల చేస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిందని. కానీ మీ బిడ్డ ప్రభుత్వం మొదటి నుంచి రైతులకు అండగా ఉంటోందని ప్రతీ రైతన్నకు రూ.61,500 సాయం అందించామని వివరించారు. మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకున్నామని, మేనిఫెస్టోలో ప్రకటించిన దాని కంటే ఎక్కువగా రూ.12,500కి బదులుగా ఏడాదికి రూ.13,500 రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ. 31వేల కోట్లు జమ చేశామని తెలిపారు.

ధాన్యం సేకరణకే రూ. 60 వేల కోట్లు ఖర్చు చేశాం..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 3.09 కోట్ల టన్నుల ధాన్యం సేకరించినట్లు సీఎం జగన్ వివరించారు. ఈ ధాన్యం సేకరణలో ఏ ఒక్క రైతన్నను ఇబ్బంది పెట్టుకుండా గ్రామాల్లోనే సేకరణ జరిగేలా చూశామని వివరించారు. ఈ నాలుగేళ్లలో ధాన్య సేకరణపై రూ.60 వేల కోట్లు ఖర్చు చేశామని, రానున్న రోజుల్లో ధాన్యం సేకరణ ఖర్చు రూ. 77 వేల కోట్లకు చేరుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. గతంలో గ్రామ స్థాయిలోని భూ వివాదాలతో రైతన్నలు చితికిపోయే వారని, దీనికి పరిష్కారంగా సుమారు వందేళ్ల తర్వాత సమగ్ర భూసర్వే చేపట్టే భారీ కార్యక్రమం చేస్తున్నట్లు వివరించారు. సమగ్ర భూసర్వేతో భూవివాదాలను పరిష్కరిస్తూనే చుక్కల భూములపై సర్వ హక్కులను మీ బిడ్డ ప్రభుత్వం రైతులకు ఇచ్చిందని గుర్తు చేశారు. అక్వా రైతులకు రూ.2,967 కోట్లు సబ్సిడీ అందించామన్నారు. రైతులకు పగటి పూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ ఇస్తూనే.. రూ.1,700 కోట్లతో ఫీడర్లను బలోపేతం చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. రూ. 1.50కే యూనిట్‌ విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా మన రాష్ట్రం ఉందని, గ్రామీణ ప్రాంతాలకు ప్రభుత్వ సేవలను తేవడంలో భాగంగా సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులను మీ గ్రామానికే తీసుకొచ్చేందకు మీ బిడ్డ ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం జగన్ ప్రకటించారు.

చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువే..
చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రతి ఏటా కరువేరనని.. మన ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో కరువు లేదు.. వలసలు లేవని సీఎం జగన్ పేర్కొన్నారు. టీడీపీ పాలనలో కనీసం సగం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేవారని సీఎం జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు, కరువు కవలలుగా ఉన్నారని సీఎం జగన్ విమర్శించారు. గడిచిన నాలుగేళ్లలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదని ఇదే మీ బిడ్డ పరిపాలనకు, చంద్రబాబు పాలనకు తేడా అని సీఎం జగన్ వివరించారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ చరిత్రలోనే విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని, ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లోనే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి రైతన్నను సంపూర్ణంగా ఆదుకున్నామని ప్రకటించారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని చంద్రబాబుకు కనీసం రైతన్నల కోసం ఏదైనా చేయాలన్న ఆలోచన కూడా అప్పట్లో రాలేదని అసహనం వ్యక్తం చేశారు.

చంద్రబాబు అధికార దాహం.. రాష్ట్రాన్ని పెత్తందారులకు పంచేందుకే..
చంద్రబాబు అధికార దాహంతో ఉన్నారని ఒక్క సారి అవకాశం వస్తే రాష్ట్రం మొత్తాన్ని తన బినామీలు, గజ దొంగల ముఠా, పెత్తందారులకు పంచేందుకు కుట్రలు చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. ప్రజలకు మంచి చేయడమనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదని ఎద్దేవా చేశారు. ధైర్యంగా, ఒంటరిగా పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదని.. చంద్రబాబు టార్గెట్ దోచుకుని, దాచుకుని నలుగురూ పంచుకోవడమేనని అందుకే ముఠా మొత్తం కలిసి పోరాడేందుకు సిద్ధమవుతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో పేదోళ్లకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతోందని.. చంద్రబాబు డీపీటీ కావాలా.. మన డీబీటీ కావాలా ? అని ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. మన పేదల ప్రభుత్వంలో ప్రతి ఇంటికి మంచి చేశానని కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు నిలిపామని వివరించారు. గతంలో ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటున్నారా అన్న చంద్రబాబు ఇప్పుడు వాళ్ల ఓట్ల కోసం గుంటనక్క వేషంలో వస్తున్నారని, దీన్ని నా ఎస్సీ, ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు గుర్తించాలని కోరారు. నా నమ్మకం మీరేనని చెప్పడానికి గర్వపడుతన్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికుల్లా నిలబడాలని కోరారు. చంద్రబాబుకు ఎన్నికలు వస్తేనే ప్రాజెక్టులు గుర్తొస్తాయని, చంద్రబాబుకు ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తొచ్చే కర్నూలుకు ఆయన హయాంలో కనీసం రూ. 10 కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. మన ప్రభుత్వంలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కోసం రూ.80కోట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. ఒక్క టామోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ కోసమే రూ.10కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివిరంచారు.

చంద్రబాబు మేనిపెస్టో ఓ బిస్మిల్లాబాత్ ..
చంద్రబాబుకు మేనిపెస్టో ఎలా తయారవుతోందో తెలియదని.. అందుకే కర్ణాటకలోని రెండు పార్టీల మేనిఫెస్టోలు కలిపి బిస్మిల్లా బాత్‌ వండేశారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. అన్ని పార్టీల పథకాలు కాపీ కొట్టి మేనిఫెస్టో​ తీసుకొచ్చారని విమర్శించారు. మన పథకాలను కాపీ కొట్టేసి పులిహోర కలిపేశారన్నారు. కానీ వైఎస్సార్ సీపీ మేనిపెస్టో తన పాదయాత్రలో ప్రజల కష్టాల నడుమ మేనిఫెస్టో పుట్టిందని, పేదవాడి గుండె చప్పుడు నుంచి మన మేనిఫెస్టో పుట్టిందని, మన మట్టి నుంచే మన మేనిఫెస్టో పుట్టిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు మరోసారి మోసపూరిత మేనిఫెస్టోతో వచ్చారని, చంద్రబాబుకు విలువలు, విశ్వసనీయత అసలే లేవని, చంద్రబాబు సత్యం పలకడు, ధర్మానికి కట్టుబడరు, మాట మీద నిలబడరు. చంద్రబాబును చూస్తే మారీచుడు, రావణుడు మాత్రమే గుర్తుకొస్తారంటూ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు.

వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద రైతులకు లబ్ధి ఇలా..
రైతన్నలకు ఒక్కొక్కరికి ఏటా రూ.13,500 చొప్పున వరుసగా 4 ఏళ్ళు వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ సాయం సీఎం జగన్‌ ప్రభుత్వం అందించింది. ఇందులో భాగంగా వరుసగా ఐదో ఏడాది మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ. 7,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 52,30,939 మంది రైతన్నల ఖాతాల్లో రూ. 3,923.21 కోట్ల రైతు భరోసా సాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. సీఎం జగన్‌ బటన్‌ నొక్కిన వెంటనే రైతు భరోసా సాయం కింద రూ.5,500లు రైతన్నల ఖాతాల్లో జమ అయ్యింది. పీఎం కిసాన్ క్రింద రావాల్సిన రూ. 2,౦౦౦ కూడా ఆ నిధులు రైతుల ఖాతాల్లోకి జమకానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement