Monday, May 6, 2024

Hot Comments – ష‌ర్మిల మాకు రాజ‌కీయ శ‌త్రువే – మంత్రి పెద్దిరెడ్డి

హిందూపూర్ – వైఎస్సార్ కుటుంబం విడిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని అన్నారు. షర్మిల కూడా చంద్రబాబు ఉచ్చులో పడ్డారన్నారు. షర్మిలను కూడా తమ పార్టీకి రాజకీయ శత్రువుగానే భావిస్తామన్నారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో జ‌రిగిన పార్టీ స‌మ‌న్వ‌య క‌ర్త‌లు స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, ఏపీలో చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని కేవలం నలుగురు మోస్తున్నారని ఎద్దేవా చేశారు. రఘువీరారెడ్డి, షర్మిల, గిడుగు రుద్రరాజు, కెవిపి రామచంద్రరావు… ఈ నలుగురు చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని మోస్తున్నారన్నారు.

కాగా 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు మంత్రి . రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకు అని వెంకయ్య నాయుడు, చంద్రబాబు అంటున్నారని.. వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుకున్నారో చెప్పాలన్నారు మంత్రి పెద్దిరెడ్డి.

ఈ కార్యక్రమంలో హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్ధి శాంతమ్మ, అసెంబ్లీ సమన్వయకర్త టి.ఎన్. దీపికలు పాల్గొన్నారు…వారిని ఉద్దేశించి పెద్దిరెడ్డి మాట్లాడుతూ హిందూపూర్ లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల పోటీకి మహిళలను సిఎం జగన్ ఎంపిక చేశార‌ని,వారిని భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement