Wednesday, May 15, 2024

Gudiwada – బావ‌పై బ్లేడ్ తో బామ్మ‌ర్ది….

గుడివాడ : బావ బాగు కోరుకునేవాడు బామ్మర్ది అంటుంటారు. కానీ ఈ ఈ బామ్మర్ది మాత్రం బావ చావు కోరుకున్నాడు. సొంత బామ్మర్ది బ్లేడ్ తో దాడిచేసి గాయపర్చిన దారుణ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. బావ ఇంట్లోకి ముసుగులు ధరించి చొరబడ్డ బామ్మర్ది గ్యాంగ్ బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు.

పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుడివాడ బైపాస్ రోడ్డులోని డ్రైవర్స్ కాలనీలో వడ్డీ త్రినాథ్ నివాసముంటున్నాడు. అతడు పామర్రుకు చెందిన కొండాలమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లయిన కొంతకాలానికే భార్యాభర్తల మధ్య మనస్పర్దలు మొదలయ్యాయి. దీంతో ఇటీవల భర్తతో గొడవపడ్డ కొండాలమ్మ పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే భార్యాభర్తల పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. గత శనివారం గుడివాడ పోలీసులు భార్యాభర్తలు త్రినాథ్, కొండాలమ్మను పోలీస్ స్టేషన్ పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినప్పటికి భార్యాభర్తల మనసు మారకపోవడంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.


తన సోదరిని కాపురానికి తీసుకుపోకుండా బాధపెడుతున్న బావ త్రినాథ్ పై తాడికొండ శర్మ కోపంతో రగిలిపోయాడు. తాజాగా పోలీస్ స్టేషన్ పంచాయితీ తర్వాత అతడి కోపం కట్టలుతెంచుకుని బావను హతమార్చేందుకు సిద్దమయ్యాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి రాత్రి ముసుగులు ధరించి బావ ఇంటికి వెళ్లాడు శర్మ. ఇంట్లో ఒంటరిగా వున్న త్రినాథ్ పై ఒక్కసారిగా బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడిచేసి గాయపర్చారు. ఒంటనిండా గాయాలతో తీవ్ర రక్తస్రావంతో త్రినాథ్ కిందపడిపోవడంతో బామ్మర్ది గ్యాంగ్ పరారయ్యింది. త్రినాథ్ అరుపులు విని చుట్టుపక్కల ఇళ్లవారు చేరుకునేసరికి అతడు రక్తపుమడుగులో కిందపడిపోయి వున్నాడు. అతడిని గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. త్రినాథ్ నుండి దాడికి సంబంధించిన వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement