Thursday, May 16, 2024

రేపు ఎన్‌టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయ స్నాతకోత్సవం.. ముఖ్యఅతిథిగా గవర్నర్‌

అమరావతి, ఆంధ్రప్రభ: డాక్టర్‌ ఎన్‌టిఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ 24 మరియు 25వ వార్షిక స్నాత కోత్సవం ఈనెల 15న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ పింగళమ్‌ తెలిపారు. విజయవాడ డాక్టర్‌ ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ కాన్ఫెరెన్స్‌ హాల్‌లో బుధవారం విశ్వ విద్యాలయ 24, 25వ వార్షిక స్నాతకోత్సవ వివరాలను మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ పింగళమ్‌ మాట్లాడుతూ ఉదయం 11-30 గంటలకు నిర్వహించే వార్షిక స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ మరియు విశ్వ విద్యాలయ కులపతి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అధ్యక్షత వహిస్తారని తిరుపతి స్విమ్స్‌ ఉప కులపతి డాక్టర్‌ జి. సుబ్రహ్మణ్యం ముఖ్య అతిధిగా పాల్గొంటారని తెలిపారు.

2018వ సంవత్సరానికి సంబంధించి నిర్వహిస్తున్న 24వ వార్షిక స్నాత కోత్సవంలో మొత్తం 67 మంది విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌ 58, సిల్వర్‌ మెడల్స్‌ 21, నగదు బహుమతులు 23 అందించనున్నామని అయన తెలిపారు. ఈ స్నాతకోత్సవంలో గుండె వైద్య పరిశోధనల్లో, వైద్య రంగంలో అత్యుత్తమ సేవలందించిన వైద్య నిపుణులు, తిరుపతి స్విమ్స్‌ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ జి. సుబ్రహ్మణ్యంకు ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ‘గౌరవ డాక్టరేట్‌’ను ప్రదానం చేయనున్నదని డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ పింగళమ్‌ తెలిపారు. 2019 సంవత్సరంకు సంబంధించి నిర్వహిస్తున్న 25వ వార్షిక స్నాతకోత్సవంలో 60 మంది విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌ 55, సిల్వర్‌ మెడల్స్‌ 18, నగదు బహుమతులు 24 అందించనున్నామని అయన తెలిపారు. వీటితో పాటు పి హెచ్‌ డి కోర్సు పూర్తి చేసిన ఐదుగురికి, సూపర్‌ స్పెషాలిటీ- డిగ్రీ ఒకరికి, గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలు 73 మందికి ప్రదానం చేయనున్నారని వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ పింగళమ్‌ తెలిపారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ర్‌ డాక్టర్‌ కె. శంకర్‌, జాయింట్‌ రిజిస్ట్రార్ర్‌ అజయ, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement