Tuesday, May 7, 2024

బీసీ‌–డీ జాబితాలోకి మున్నూరు కాపులు.. స‌ర్టిఫికెట్స్‌ జారీకి ప్రభుత్వం ఉత్తర్వులు

తూర్పు గోదావరి జిల్లాలోని చింతూరు, కూనవరం, ఎటపాక మండలాలు పశ్చిమ గోదావరం జిల్లాలోని కుకునూరు, వేలయిర్పాడు బూర్గంపాడు మండలాల్లోని మున్నూరు కాపు కులాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు తెలిపారు.

తెలంగాణ ప్రాంతం నుండి ఏపీలో విలీనం అయిన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని ఏడు మండలాల్లో నివసిస్తున్న మున్నూరుకాపు కులాన్ని గ్రూప్ -డి కింద వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని చింతూరు, కూనవరం, ఎటపాక మండలాలు పశ్చిమ గోదావరి జిల్లాలోని కుకునూరు, వేలయిర్పాడు, బూర్గంపాడు మండలాలలోని మున్నూరుకాపు కులస్తులను బిసి-డి కేటగిరి కింద కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని తెలంగాణ నుండి విలీనమైన మండలాలోని మున్నూరుకాపు కులానికి చెందినవారు అభ్యర్థించడం జరిగిందన్నారు. దీనిపై రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమీషన్ నివేదికను సమర్పించిందన్నారు.

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్ల ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికను నిశితంగా పరిశీలించి ఏడు మండలాలకు చెందిన మున్నూరుకాపు కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం అయిన ఏడు మండలాలలో నివస్తున్న మున్నూరుకాపు ప్రజలకు కులదృవీకరణ పత్రాలు జారీ చేసేటప్పుడు నిర్ధేశించిన మార్గదర్శకాలను పరిగణంలోకి తీసుకోవాల్సివుంటుందని కాపు కార్పొరేషన్ చైర్మన్ ఆ ప్రకటనలో తెలిపారు.

ఇటీవల గోదావరి వరదల సమయంలో ముంపు మండలాల ప్రజలు(మున్నూరు కాపు కులానికి చెందినవారు),తాను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారిని కలసి ఈ సమస్యను విన్నవించడం జరిగిందన్నారు. సమస్య తీవ్రతను గుర్తించిన ముఖ్యమంత్రి వెంటనే స్పందించి అధికారులకు తగిన విధంగా ఆదేశాలివ్వడం జరిగిందన్నారు.ఆ ఆదేశాలకు అనుగుణంగా మున్నూరు కాపు కులస్ధులకు బిసి-డి కింద కులధృవీకరణ పత్రాల జారీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement