Tuesday, April 30, 2024

AP: హర్యానాకు చెందిన ఏటీఎం దొంగల ముఠా అరెస్ట్

తిరుపతి ప్రతినిధి: అత్యాధునిక పరికరాలతో ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్న హర్యానా దొంగల ముఠాను తిరుపతి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు తిరుపతిలో శుక్రవారం జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, హర్యానాకు చెందిన దొంగల ముఠా ఏ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు, ఎలా వారిని అరెస్ట్ చేశారో వివరించారు.


గత సెప్టెంబర్ 14వతేదీ తిరుపతి రూరల్ ధనలక్ష్మినగర్ లోని ఎస్.బి.ఐ ఏటీఎంలో దొంగతనానికి పాల్పడ్డారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న చంద్రగిరి డి.ఎస్.పి యశ్వంత్ ఆధ్వర్యంలో ఇన్ స్పెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ లు బృందాలుగా ఏర్పడి ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో జల్లెడ పట్టినట్టు తెలిపారు. అందులో భాగంగానే ఏటీఎంలో దొంగతనాలు చేస్తున్నది మేవాత్ గ్యాంగ్ గా గుర్తించిన పోలీసులు ఆ దిశగా వేగంగా గాలించారు. దీంతో హర్యానాకు చెందిన ఏటీఎం దొంగల ముఠాలోని ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు, రెండు లారీలు, ఓ కారు, రెండు నాటు తుపాకులు, 21 కేజీల గంజాయి, గ్యాస్ కట్టర్స్ పరికరాలు, రెండు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు.


మేవాత్ గ్యాంగ్ పై ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో 19 కేసులున్నాయని, ముఠాలో ప్రధాన ముద్దాయి సద్దాంఖాన్ పై వివిధ రాష్ట్రాల్లో 23 కేసులు నమోదయినట్టు తెలిపారు. ఏటీఎం దొంగతనాలతో పాటు గంజాయిని కూడా ఈ ముఠా విక్రయించేదని, అది కూడా ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తక్కువ రేటుకు కొనుగోలు చేసి హర్యానా రాష్ట్రంలో ఎక్కువ రేట్లకు విక్రయించేవారని తెలిపారు. ఈ ముఠాలోని ఇద్దరు సభ్యులు రహాడి సద్దాం, అమీర్ ఖాన్ లు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటాంమని ఎస్పీ ధీమా వ్యక్తం చేశారు. ఏటీఎం అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులైన నిందితులను చాకచక్యంగా పట్టుకున్న తిరుపతి రూరల్ పోలీసులకు రివార్డులు అందజేసినట్టు ఎస్పీ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement