Friday, May 3, 2024

అడ్డగోలు చర్యలతోనే ఆర్థిక సంక్షోభం.. యనమల రామకృష్ణుడు విమ‌ర్శ‌లు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో వాస్తవ ఆర్థిక పరిస్థితిని మరుగునపెట్టి తప్పుడు లెక్కలతో అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్ర రెవెన్యూ ఆదాయాలతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా అధిక వడ్డీలకు అప్పులు తెస్తూ రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడుతోందని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఒక తప్పును సరిద్దిడానికి తప్పుమీద తప్పు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని మండిపడ్డారు. . రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించడంతో వేజ్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌ పరిమితులపై కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆంక్షలు విధించిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలైన ఉపాధి హామీ, రాష్ట్రీయ ఉచ్చతర్‌ శిక్షా అభియాన్‌(రూసా), వ్యవసాయ యాంత్రీకరణ సబ్‌మిషన్‌, సుస్థిర వ్యవసాయ కమిషన్‌, ఆయిల్‌ పామ్‌ మిషన్‌, జాతీయ ఆహార భద్రత మిషన్‌, రోజ్‌గార్‌ యోజన, సడక్‌ యోజన, జల్‌జీవన్‌ వంటి పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత వ్యయం చేస్తోందో చెప్పాలన్నారు.

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఇచ్చే ప్రత్యేక నిధులను సైతం రాష్ట్ర వాటా జోడించి ఖర్చు చేయడంలో విఫలం కావడంతో ఆ నిధులు సైతం వెనక్కి వెళ్లాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14, 15 ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన రూ. 6 వేల కోట్లు ఏమయ్యాయని, జల జీవన్‌ మిషన్‌ కింద రాష్ట్రానికి వచ్చిన రూ.7 వేల కోట్లు ఏం చేశారు.. ఎక్కడ ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. ఈ పథకాలన్నింటికీ కేంద్రం ఎంత ఇస్తుందో వివరాలు తెలియజేయాలని యనమల డిమాండ్‌ చేశారు. కేంద్ర పథకాల కింద వచ్చే ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవడం లేదని, వచ్చిన నిధులను దారి మళ్లిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అడ్డుకుంటు-న్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులు చెల్లించకపోవడంతో రైల్వే పనులు నిలిచిపోయిన విషయం వాస్తవం కాదా అని, నడికుడి, శ్రీకాళహస్తి, నరసాపురం, కోటిపల్లి రైల్వే ప్రాజెక్టులు జాప్యం కావడానికి జగన్‌ రాష్ట్ర నిధులు చెల్లించకపోవడం వల్లనే అటకెక్కిన విషయం వాస్తవం కాదా అని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రుణాలు, ఉపయోగిస్తున్న నిధులపై కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్‌, రిజర్వ్‌ బ్యాంక్‌తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, అందించిన నివేదికలు, ఆ సంస్థలు ఇచ్చిన ఆదేశాలు, అందులో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినవి, అమలు చేయని వివరాలను బట్టబయలు చేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement