Tuesday, April 23, 2024

Big Story: దారిలోకొచ్చిన ధ‌ర‌ణి స‌మ‌స్య‌.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మరిన్ని ఆప్ష‌న్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ధరణి సమస్యలను నివారించి రైతులను కార్యాలయాల చుట్టూ తిరిగే బాధలు లేకుండా చూడాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రైతులకు కష్టాలు తీరనున్నాయి. ధరణి పోర్టల్‌తో ఇబ్బందులు పడుతున్న రైతుల బాధలను తొలగించేందుకు సర్కార్‌ కీలక కార్యాచరణ చేపట్టింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో సీఎస్‌, సబ్‌ కమిటీ చైర్మన్‌ హరీష్‌రావులతో కూడిన బృందం గురువారం క్షేత్రస్థాయికి చేరుకుని ప్రత్యక్షంగా సమస్యలపై అధ్యయనం చేశారు. గురువారం ఈ మేరకు ధరణి పోర్టల్‌ రోజూవారీ కార్యకలాపాల్లో తలెత్తుతున్న సమస్యలను పూర్తిగా రూపుమాపేందుకు, పరిష్కార మార్గాలపై సీఎస్‌ సోమేష్‌కుమార్‌, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌తో కలిసి రాష్ట్ర ఆర్శిక శాఖ మంత్రి, ధరణి సమస్యలపై ఏర్పాటైన సబ్‌ కమిటీ చైర్మన్‌ హరీష్‌రావుతో భేటీ అయ్యారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి సమస్యలను గుర్తించాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో సబ్‌ కమిటీ చైర్మన్‌, మంత్రి హరీస్‌రావు, సీసీఎల్‌ఏగా ఉన్న సీఎస్‌ సోమేష్‌కుమార్‌, సిద్ధిపేట జిల్లా ములుగులో సమీక్షించి సమస్యలపై చర్చించారు.

తాజా భేటీలో ప్రధానంగా పాస్‌ పుస్తకాలు, ధరణి పోర్టల్‌లో పేర్ల తప్పులు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, సర్వే నెంబర్ల పార్టుల సంబంధిత వివరాల్లో తేడాల వంటివాటిపై చర్చించారు. ఈ కమిటీ ధరణి పోర్టల్‌లో ఉన్న లోపాలపై అధ్యయనం చేస్తోంది. రాష్ట్ర ఉన్నతాధికారులతో కూడిన బృందంతో కలిసి చర్చించి, అధ్యయనం చేసి పరిష్కారా మార్గాలతో కూడిన కొత్త మాడ్యూళ్లను ప్రవేశపెట్టాలనే యోచనపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలపై కూడా సుధీర్ఘంగా చర్చించారు. ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులను ఎలా పరిష్కరించాలనే అంశంపై కూడా కూలంకషంగా చర్చించారు. ధరణి పోర్టల్‌లో సమస్యల అధ్యయనానికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులన్నింటినీ ఒక్కొక్కటిగా చర్చించి, వాటిలో సాంకేతికంగా ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, ఇతర అంశాలను ఈ సమావేశం చర్చించింది. ధరణి పోర్టల్‌కు వచ్చిన సమస్యలు, వాటి పరిష్కారం, వివిధ మాడ్యూల్స్‌, ఇతర సమస్యలను చర్చించారు.

ఇంకా మరో 12కుపైగా తీవ్రమైన సమస్యలు ధరణిలో ఉన్నాయి. ఇవి రైతులకు ఇబ్బందిగా పరిణమించాయి. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆప్షన్‌ 33లో పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల్లో తప్పులను సరిచేసుకునే వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో పేరు మార్పు, భూమి స్వభావం మార్పు, భూమి వర్గీకరణ మార్పు, భూమి రకం మార్పు, పరిధి దిద్దుబాటు, మిస్సింగ్‌ సర్వే నెంబర్‌, మిస్సింగ్‌ డివిజన్‌ నెంబర్‌ చేర్పు, నోషనల్‌ ఖాతా పేరుతో ఉన్న వాటిని సరిచేసే చర్యలు, వాటినుంచి పట్టా భూమిగా మార్పు, భూమి అనుభవం కాలంలో మార్పులకు ఈ కొత్త ఆప్షన్‌ అందుబాటులోకి తెచ్చింది. తద్వారా లక్షలాది మంది రైతుల సమస్యలకు పరిష్కారం దొరకనుంది.

కాగా సబ్‌ కమిటీ గుర్తించిన 40 సమస్యల్లో కేవలం పాస్‌ పుస్తకాల్లో తప్పుల సవరణకు మాత్రమే గత నెలలో ప్రభుత్వం అవకాశమిచ్చింది. సిద్దిపేట జిల్లా ములుగులో 2200మందికిపైగా రైతులు ఉండగా, 200లకుపైగా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా సమస్యలు, వాటి వర్గీకరణ, తీరు తెన్నులు, పరిష్కార మార్గాలు, అధికారులు తీసుకున్న చర్యలను పరిశీలించారు. పాస్‌ పుస్తకాల్లో తప్పులు, సర్వే నెంబర్లలో నమోదు కాని భూమి, నిషేదిత జాబితాలో పడిన భూములు, వ్యవసాయేతర భూముల కన్వర్షన్‌, గజాల్లో మ్యుటేషన్ల సమస్యలు, వారసత్వ బదలీలు, సాగులో ఉన్న భూమి వ్యవసాయేతర భూమిగా రికార్డుల్లో పడటం, మైనర్ల ఫోటోలు పాస్‌ పుస్తకాల్లో లేనితీరు, అసైన్డ్‌, ఇనాం తదితర భూముల హక్కులు, మ్యుటేషన్‌కు ముందే భూ యజమాని మరణించిన సందర్భాలు వంటివాటిని పరిశీలించారు. త్వరలో మరో 7 ఐచ్చికాలతో ల్యాండ్‌ ఓనర్‌ ప్రెండ్లీ ధరణి దిశగా సర్వం సిద్దమైంది. ధరణి సమస్యలను నివారించి మరింత సౌకర్యవంతంగా రైతాంగానికి మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అధికారులు చురుగ్గా శ్రమిస్తున్నారు. 40 రకాల సమస్యల నివారణకు 7 కొత్త ఆప్షన్‌లను రూపొందించిన అధికారులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

అసలు పట్టాదారును గుర్తించేందుకు తీసుకోవాల్సిన మార్గదర్శకాలు, వేరే వ్యక్తుల పేర్లతో ఉన్న భూములను ఇతరులకు మార్చితే కల్గే న్యాయపరమైన ఇబ్బందులు, ఈ నిర్ణయాధికారం ఎవరికి ఇవ్వాలి…వాస్తవ భూమికి, ధరణిలో నమోదైన భూమికి మధ్య ఉన్న విస్తీర్ణం వ్యత్యాసాల సరిజేత, పట్టా భూములను నిషేదిత జాబితాలోనుంచి తొలగించడం, స్వాతంత్య్ర సమరయోధులు, సైనికులకిచ్చిన భూములు, సవరణ అధికారం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. భూమి రకం, వినియోగ మార్పులు, మిస్సింగ్‌ సర్వే నెంబర్ల చేర్పులు, ఒకరికంటే ఎక్కువమంది క్రయ విక్రయదారుల పేర్ల చేర్పు వంటి వాటిలో రెండు ఆప్షన్లు ఉన్నాయని మరో 5 మ్యాడ్యూల్స్‌ అతి త్వరలో అందుబాటులోకి తేనున్నారు. ఈ వివరాలతో దరణి పోర్టల్‌ను మరింత సరళంగా మార్చి, సమస్యలను సులభంగా పరిష్కరించి ప్రజలకు మేలు చేసేలా కార్యాచరణ ముమ్మరంగా జరుగుతోంది.

- Advertisement -

ధరణి పోర్టల్‌లో దొర్లిన తప్పులను సరిదిద్ది, సాంకేతికంగా మార్పులు చేసేందుకు మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన ప్రభుత్వం తాజాగా కలెక్టర్లనుంచి ధరణి సమస్యలపై వివరాలను సేకరించింది. సుమారు 18రకాల సవరణలకు సూచనలు రావడంతో సీఎం కేసీఆర్‌ తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నిషేదిత జాబితాలోనుంచి భూములను క్లీయర్‌ చేసేందుకు ప్రత్యేక ఆప్షన్‌ను కలెక్టర్ల లాగిన్‌లో చేర్చారు. ఇప్పటివరకు వివిధ రకాల సమస్యలపై 1.70 లక్షలకుపైగా ఫిర్యాదులు రైతుల నుంచి వచ్చాయని, సుమారు 10లక్షలకుపైగా ఎకరాలకు చెందిన భూములు నిషేదిత జాబితాలో ఉండటంతో ఇబ్బందులు వస్తున్నాయని ప్రభుత్వానికి నివేదిక అందింది. ఈ నేపథ్యంలో గ్రామస్థాయిలోనే ప్రభుత్వ భూముల రిజిస్టర్‌ రూపొందించాలనే యోచనతోపాటు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, జియో కోఆర్డినేట్స్‌ ఫిక్స్‌ చేయాలని, సర్వే మ్యాపింగ్‌ వివరాలను రిజిస్ట్రేషన్‌ శాఖకు పంపే యోచన పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు తీసుకున్న చర్యలపై జిల్లాల వారీగా అఫిడవిట్లు రూపొందించాలని కూడా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారిన గ్రామకంఠం, నోటరీ డాక్యుమెంట్ల సమస్యలు కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పంచాయితీరాజ్‌ గ్రామీణ అభివృద్ది శాఖకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల్లో ఇప్పటికే ఇండ్లు ఉన్న భూములు, ఖాళీ స్థలాలను గుర్తించే ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. రెవెన్యూ శాఖ సమన్వయంతో క్షేత్రస్థాయిలో అబాది భూములను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందిస్తున్నారు. గ్రామ పంచాయితీల వారీగా సేత్వార్‌, ఖాస్ర, సేస్లా, జమాబందీ, పైసల్‌పట్టి తదితర రికార్డుల ఆధారంగా గ్రామకంఠాల లెక్క తీసి ఎంత వినియోగంలో ఉంది, ఎంత వృధాగా ఉందనే వివరాలను లెక్క తీస్తున్నారు.

ధరణి పోర్టల్‌లో నెలకొన్న 7 రకాల సమస్యలను తక్షణమే నివారించేలా పరిష్కార మార్గాలకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. లక్షలాది ఎకరాల ప్రైవేట్‌ పట్టా భూములు, మాజీ సైనికుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పాస్‌ పుస్తకాల్లో తప్పుల సవరణ, జాయింట్‌ రిజిస్ట్రేషన్‌, అసైన్డ్‌ భూముల విరాసత్‌, గతంలో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో జరిగిన క్రయ విక్రయాలకు మ్యుటేషన్లు వంటి సమస్యలకు చరమగీతం పాడేలా చర్యలు తీసుకుంటున్నారు.

పెండింగ్‌ పాస్‌ పుస్తకాలు కూడా త్వరలో…

-పాస్‌ పుస్తకం ఉంటేనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా ఆరు లక్షల ఖాతాలకు వెంటనే పెండింగ్‌ పాస్‌ పుస్తకాలు జారీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. డిజిటల్‌ సిగ్నిచర్లు, ఆధార్‌ సీడింగ్‌ పూర్తి చేసేలా ఆదేశాలు జారీ అయ్యాయి. భూమి మార్టిగేజ్‌లో నెలకొన్న సమస్యలపై పరిష్కార మార్గాలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో వెంచర్లుగా మారిన భూములను తక్షణమే వ్యవసాయేతర భూమిగా మార్పులు చేసేందుకు లెక్కలు తీస్తున్నారు. రాష్ట్రంలో 63 లక్షల 25వేల 695 మంది రైతులకు చెందిన ఒక కోటి 50 లక్షల 18వేల ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉన్నట్లుగా ధరణి రికార్డుల్లో ఉంది. అయితే పలు జిల్లాల్లో లక్షల ఎకరాలు వ్యవసాయేతర అవసరాలకు మార్పు చెందినట్టుగా అనధికారికంగా అంచనాలున్నాయి. అయితే వాస్తవికంగా సాగులో ఉన్న భూమి విస్తీర్ణం తేల్చి వాటినే ధరణిలో కొనసాగించాలని మిగతా వాటికి పాస్‌ పుస్తకాలు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement