Monday, April 29, 2024

విశాఖలో విహార నౌక ప్రారంభం.. కాసినో ఉన్నాఏపీ బోర్డర్‌లో జరగదు

విశాఖపట్నం, ప్రభన్యూస్‌: పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా విశాఖ నుంచి చెన్నై వరకూ విహార నౌక క్రూయిజ్‌ను పర్యాటకుల కోసం ప్రారంభించినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. విదేశీ నౌక ఎంప్రెస్‌ (క్రూయిజ్‌) సర్వీసులను బుధవారం విశాఖ పోర్టు చైర్మన్‌ కె.రామ్మోహన్‌రావుతో కలసి మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగానే మంత్రి రోజా ఈ క్రూయిజ్‌ షిప్‌లో వసతులను స్వయంగా పరిశీలించారు.సుమారు రెండు గంటల పాటు షిప్‌లో ఉన్న వసతులపై సంబంధింత అధికారులను మంత్రి రోజా అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎంప్రెస్‌ క్రూయిజ్‌ షిప్‌లో వసతుల న్ని బాగున్నాయని, మహిళలకు రక్షణ, వైద్యసౌకర్యాలు ఉన్నాయన్నారు. ఈ షిప్‌లో కాసినో సౌకర్యం ఉన్నప్పటికీ ఏపీ బోర్డర్‌లో ఉన్న సమయంలో జరగటానికి వీలులేదని, ఆ తరువాత ఇంటర్నేషనల్‌ పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో అమలు చేసే అవకాశం ఉందన్నారు.

విశాఖ ప్రజల చిరకాల వాంఛగా ఉన్న విహార నౌక ప్రయాణం జీవితకాలంలో మంచి అనుభూతి ఈ నౌక ప్రయాణం ద్వారా మిగిలిపోతుందని, అబ్బురపరిచే విధంగా అన్ని వసతులు నౌకలో ఉన్నాయన్నారు. ఇక విశాఖలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను టీడీపీ దొంగలు అడ్డుకుంటున్నారని, వారు అడ్డుపడకపోతే వైజాగ్‌ పర్యాటకంలో ముంద ంజలో ఉండేదన్నారు. రుషికొండలో ఆధునిక పర్యాటక వసతులు కల్పించనున్నామన్నారు.రుషికొండ అభివృద్దిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని, ప్రతి విషయానికి కోర్టుకు వెళ్లడం సరికాదున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో పాటు, పోర్టు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.అయితే బుధవారం ఉదయం విశాఖ పోర్టుకు చేరుకున్న ఈ క్రూయిజ్‌ షిప్‌లో ప్రయాణించేందుకు అధిక సంఖ్యలో విశాఖ నుంచి పర్యాటకలు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆయా షిప్‌ వద్ద సందడి వాతావరణం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement