Tuesday, May 7, 2024

Kalyandurgam : దేశంలో ఎక్కడా లేని విధంగా పంట బీమా.. సీఎం జగన్

దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతుల ఖాతాల్లో పంట బీమా పరిహారం జమ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈ రోజు వైఎస్సార్‌ రైతు దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. 2022–ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతులకు బీమా పరిహారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ… బీమా పరిహారం రూ.1,117 కోట్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10.2 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. చంద్రబాబు గజ దొంగల ముఠా మొసలి కన్నీరు కారుస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. గతంలో కరవు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వంలో పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు.

గతంలో పేదలను చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు ? చంద్రబాబు పాలనలో డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది ? రాబోయే రోజుల్లో ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తారు. నైతికత లేని వ్యక్తిని చంద్రబాబు అంటారు. వీళ్లలా నాకు అబద్ధాలు చెప్పడం రాదని జగన్ అన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు బీమా పరిహారంగా రైతులకు చెల్లించింది కేవలం రూ.3,411 కోట్లు. తాము అధికారంలోకి వచ్చాక రైతులకు చెల్లించింది రూ. 7,802 కోట్లు అన్నారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా ఇన్సూరెన్స్‌ ప్రీమియం కట్టామని చెప్పారు. ఐదేళ్లలో చంద్రబాబు.. రైతులకు అరకొరగా బీమా డబ్బులు చెల్లించారని విమర్శించారు. మనకు పాడి పంటలు ఉండే పాలన కావాలా.. నక్కలు, తోడేళ్లు ఉండే పాలన కావాలా ? రైతు రాజ్యం కావాలా.. రైతులను మోసం చేసే పాలన కావాలా ? రైతుకు తోడుగా ఆర్భీకే వ్యవస్థ కావాలా.. దళారీ వ్యవస్థ కావాలా ? పేదల ప్రభుత్వం కావాలా.. పెత్తందారుల ప్రభుత్వం కావాలా? ఏ ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని జగన్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement