Sunday, May 5, 2024

Congress – జగన్ అంటేనే మోసం – అన్నపై షర్మిల గరం గరం …

వైఎస్సార్​ రైతుల పక్షపాతి
రుణాలను మాఫీ చేశారు
గిట్టుబాటు ధర ఇచ్చారు
ఈ జగన్​ సబ్బిడీలు ఆపేశారు
మద్య నిషేధం పక్కన పెట్టారు
ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతోంది
హంతకులకు కొమ్ముకాస్తున్నారు
అసలు వైఎస్సార్​ వారసుడేనా?
నేనే రాజన్న బిడ్డను.. గెలిపించండి
ఎంతకష్టం వచ్చినా మీ వెంటే ఉంటా
బ్రహ్మంగారి మఠంలో షర్మిల ప్రచారం

( ఆంధ్రప్రభ , కడప బ్యూరో) : వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సీఎం జగన్ వారసుడే కాదని ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఏపీలో ఆమె చేపట్టిన న్యాయ యాత్ర సోమవారం వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠానికి చేరింది. ఆ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. వైఎస్‌ పాలనతో జగన్‌ పాలనకు పొంతనే లేదన్నారు. భూతద్దం పెట్టి చూసినా ఆ ఆనవాళ్లు కనిపించవని చెప్పారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు లో ఎంపీ అవినాష్‌రెడ్డి నిందితుడని సీబీఐ చెప్పిందని.. కాల్ రికార్డులు, గూగుల్‌ మ్యాప్స్‌, లావాదేవీలు ఉన్నట్లు పేర్కొందని గుర్తుచేశారు. అన్ని ఆధారాలు ఉన్నా అతడిని జగన్‌ కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హంతకులకు ఓటు వేయొద్దు..

”వైసీపీ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ధరల స్థిరీకరణ అని చెప్పి జగన్‌ మోసం చేశారు. వైఎస్‌ఆర్‌ హయాంలో రైతు రారాజు.. ఇప్పుడు అప్పులేని రైతే లేడు. పంట నష్టం జరిగితే రూపాయి కూడా పరిహారం రావడం లేదు. డ్రిప్‌ వేసుకోవడానికీ అవకాశం లేకుండా సబ్సిడీలన్నీ ఆపేశారు. సంపూర్ణ మద్య నిషేధం హామీ ఇచ్చారు.. కానీ ప్రభుత్వమే విక్రయిస్తోంది. ఇష్టారీతిన అమ్ముతున్నారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. మెగా డీఎస్సీ వేస్తామని చెప్పారు. నాలుగున్నరేళ్లు నిద్రపోయి కేవలం 6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. జగన్‌ది హత్యా రాజకీయాలు చేసే పాలన. సొంత బాబాయిని చంపిన నిందితులను కాపాడుతున్నారు. నిందితుడు అవినాష్‌కే మళ్లీ టికెట్‌ ఇచ్చారు. అతడు చట్టసభల్లోకి వెళ్లకూడదు. అన్యాయాన్ని ఎదురించేందుకే ఎంపీగా పోటీచేస్తున్న. న్యాయం కోసం పోరాటం ఓ వైపు.. హంతకులు మరో వైపు.. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో ఆలోచించాలి. హంతకులకు ఓటు వేయొద్దు. వైఎస్‌ఆర్‌ బిడ్డను గెలిపించాలని కోరుతున్నా. ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటా” అని షర్మిల అన్నారు.

- Advertisement -

నాన్నను చంపి.. మమ్మల్ని రోడ్ల పాల్జేశారు: వివేకానంద తనయ సునీత

ఆడది అంటే నారీ శక్తి అని వివేకా కుమార్తె సునీత అన్నారు. తమను అలాగే పెంచారని చెప్పారు. షర్మిలతో కలిసి బస్సుయాత్రలో పాల్గొని ఆమె మాట్లాడారు. ”తప్పు అంటే తప్పు అని చెప్పే మనస్తత్వం మాది. వివేకాను ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసు. న్యాయం కోసం పోరాడుతున్నాం. ఆయన్ను చంపి మమ్మల్ని రోడ్డు పాల్జేశారు. షర్మిలను ఎంపీగా చూడాలనేది వివేకా కోరిక. ప్రజలు భారీ మెజారిటీతో ఆమెను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్న” అని సునీత అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement