అమరావతి,ఆంధ్రప్రభ: ఏ తరహా ప్రసవం జరిగినా ఆరోగ్య ఆసరా కింద తల్లికి రూ.5వేలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖపై క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, ఆరోగ్యశ్రీ, దాని కింద కార్యక్రమాలు, వైద్య ఆరోగ్యశాఖలో నాడు – నేడు కింద చేపడుతున్న పనులు, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, క్యాన్సర్ కేర్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సహజ ప్రసవం జరిగినా, సిజేరియన్ జరిగినా తల్లికి రూ.5వేలు ఇవ్వాలన్నారు. గతంలో సిజేరియన్ జరిగితే రూ.3వేలు ఇచ్చామని దీన్ని రూ.5వేలకు పెంచాలని ఆదేశించారు. సహజ ప్రసవం అయినా, సిజరేయన్ అయినా తల్లిబిడ్డల సంరక్షణ ముఖ్యం కాబట్టి, ఒకే మొత్తాన్ని ఇవ్వాలన్నారు. సహజ ప్రసవాలను పెంచడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. సహజ ప్రసవలపై అవగాహన, చైతన్యం నింపాల్సిన బాధ్యత వైద్యులదేనని సూచించారు.
ఆరోగ్యశ్రీ పరిధి పెంపు..
ఆరోగ్యశ్రీలో 2446 ప్రొసీజర్లు కవర్ అవుతున్నాయని, నెలకు ఆరోగ్యశ్రీ కింద కనీసంగా రూ.270 కోట్లు ఖర్చు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. 104,108 కోసం నెలకు కనీసంగా రూ.25 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఆరోగ్య ఆసరా కింద నెలకు కనీసంగా రూ.35 కోట్లు ఖర్చుచేస్తున్నామని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, అనుబంధ కార్యకలాపాలకోసం ఏడాదికి దాదాపు రూ.4వేల కోట్లు ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది ఆయుష్మాన్భారత్ కింద రూ.223 కోట్లు వచ్చిందని, ఈ ఏడాది రూ.360 కోట్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లపై నిరంతర అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. అవసరాల మేరకు, మరింత మంచి చేయడానికి ప్రొసీజర్ల సంఖ్యను పెంచాలన్నారు.
దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించామని, వైద్యులు, వైద్య సంఘాలతో చర్చిస్తున్నామని అధికారులు తెలిపారు. వారం రోజుల్లో రోజుల్లో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం జగన్ సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పారదర్శకంగా నిర్వహించే క్రమంలో భాగంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు వేయాలన్నారు. అక్కడ నుంచి ఆస్పత్రికి ఆటోడెబిట్లో చెల్లింపులు చేయాలన్నారు. పేషెంటు డిశ్చార్జి అయ్యే సమయంలో కన్సెంటు ఫారం స్వీకరించాలన్నారు. పేషెంటు, బ్యాంకు, ఆస్పత్రి మధ్య కన్సెంటుతో కూడిన ఫారం ఉండాలని, ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. ఈ విధానంలో చాలావరకు పొరపాట్లను నివారించే అవకాశం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.
నియంత్రణలో కోవిడ్..
రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులన్నీ పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని సీఎంకు అధికారులు వివరించారు. 18 సంవత్సరాల్లోపు వారికి కూడా రెండుడోసులు దాదాపుగా పూర్తయిందన్నారు. 15 నుంచి 17 ఏళ్లలోపు వారికి 99.65శాతం, 12 నుంచి 14 ఏళ్లలోపు వారికి 97.78శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపారు. కోవిడ్పై అప్రమత్తంగా ఉండాల్సిందిగా సీఎం సూచించారు.
గడువులోపు పనులు పూర్తి చేయండి విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్, కొత్త ఆస్పత్రుల నిర్మాణం, వీటిలో అభివృద్ధి పనులు నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. పీహెచ్సీల్లో 977 సెంటర్లలో అభివృద్ధిపనులు పూర్తయ్యాయని, కొత్తవాటి నిర్మాణం చురుగ్గా సాగుతోందన్న అధికారులు తెలిపారు.
విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్లో పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయన్నారు. రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన 16 మెడికల్ కాలేజీల పనులపై సీఎం సమీక్షించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నంలలో కొత్త మెడికల్ కాలేజీల్లో 2023 నుంచి మెడికల్ ప్రవేశాలకోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించారు. మెడికల్కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం చేయాల్సిన పనులు వేగంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. డిసెంబర్నాటికి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మిగిలిన చోట్ల కూడా నిర్మాణాలు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. ఒకటి రెండు చోట్ల స్థలాలపై కోర్టు కేసులున్నాయన్న అధికారులు తెలపగా వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించే ప్రయత్నంచేయాలని సీఎం అధికారులకు సూచించారు.
కేన్సర్ కేర్పై దృష్టి..
విలేజ్ క్లినిక్స్ స్థాయిలోనే క్యాన్సర్ గుర్తింపుపై దృష్టిపెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. అందుకోసం విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్, పీహెచ్సీలను వీలైనంత త్వరగా పూర్తిచేసుకోవాలన్నారు. డిసెంబర్ నాటికి వీటిని పూర్తిచేయాలని గడువు విధించారు. ఇవి పూర్తయితే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానం సమర్థవంతంగా అమలు జరుగుతోందన్నారు. క్యాన్సర్ గుర్తింపు అన్నది సులభంగా జరుగుతుందన్నారు. సిబ్బందికి క్యాన్సర్ స్కీన్రింగ్పై శిక్షణ ఇప్పించాలన్నారు. దీనివల్ల క్యాన్సర్ గుర్తింపు నుంచి చికిత్స వరకూ సమర్థవంతమైన వ్యవస్థ ఏర్పడుతుందని సీఎం పేర్కొన్నారు.
టాటా మెమోరియల్ ద్వారా రాష్ట్రంలో వైద్య సిబ్బందికి, వైద్యులకు శిక్షణకు ఎంఓయూ కుదిరిందని అధికారులు తెలిపారు. దీంతోపాటు స్విమ్స్ ఆస్పత్రిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని సీఎం సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసే 16 మెడికల్కాలేజీలతో కలిపి 27 మెడికల్కాలేజీల్లో కూడా క్యాన్సర్ నివారణకు రెండేసి చొప్పున లైనాక్ మెషిన్లు ఉండేలా బ్లూ ప్రింట్ ఉండాలన్నారు. విశాఖ, తిరుపతి, గుంటూరులో క్యాన్సర్ నివారణపై సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటుపై పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధంచేసి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.