Wednesday, May 15, 2024

తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిని గెలిపించండి : ఎమ్మెల్యే భూమన‌

తిరుపతి సిటీ : ప్రతిష్టాత్మక తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులే విజయ దుందుభి మోగిస్తారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భూమన కరుణాకర రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. స్థానిక పోస్ట్ ఆఫీస్ రోడ్డు, నవాబ్ పేట, ఎస్ కే డి నగర్, సున్నపు వీధి, బండ్ల వీధి నెహ్రు వీధి, పెద్ద కాపు వీధి చిన్న కాపు వీధి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే మీడియా ప్రతినిధులతో భూమన కరుణాకర రెడ్డి మాట్లాడారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టౌన్ బ్యాంక్ ఎన్నికలు ఈనెల 20వ తేదీన జరగనున్నాయని తెలిపారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన టౌన్ బ్యాంక్ ఎన్నికలో సమర్థవంతమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమను ఆదేశించారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సుశిక్షితులైన, సమర్థవంతమైన, తెలివైన వారిని సేవ చేయాలన్న సంకల్పంతో ఉన్న 12 మందిని అభ్యర్థులుగా నిర్ణయించి బరిలోకి దించినట్టు తెలిపారు. ఈ రోజే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న తమను ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్నారని వివరించారు. టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో 12 అభ్యర్థులను గెలిపించుకునే విధంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు కలిసికట్టుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నామని తెలిపారు. వైఎస్సార్ సీపీ బలపరుస్తున్న అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ వైఎస్సార్ సీపీ డైరెక్టర్ అభ్యర్థులు కేతం జయచంద్రా రెడ్డి, రేమాల బ్రహ్మానంద రెడ్డి, అనిల్ రాయల్, కాశీం, కడపగుంట అమరనాద్ రెడ్డి, మాకం చంద్రయ్య, వై వాసుదేవ యాదవ్, పోలిరెడ్డి నాగిరెడ్డి, మబ్బు నాధముని రెడ్డి, వెంకటేష్ రాయల్, వేమూరి జ్యోతి ప్రకాష్, అత్తూరు సురేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement