Saturday, April 27, 2024

ఎపికి ల‌క్ష కోట్లు ఇచ్చాం- జె పి న‌డ్డా…

నాయుడుపేట, ‌: అవినీతి అన్న మాటకు తావులేకుండా ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ ప్రజలంతా గర్వించే విధంగా సువర్ణ పరిపాలన అందిస్తున్నారని, ఆయన పరిపాలనలో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలంతా ఆనందంగా జీవిస్తున్నారని భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ప్రకాష్‌ నడ్డా తెలియజేశారు. తిరుపతి ఉప ఎన్నికలను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఏఎల్‌సీఎం క్రీడా మైదానంలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా ఎన్నికల బరిలో నిలిచిన కత్తి రత్నప్రభ కు మద్దతుగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన అధ్యక్షులు వకీల్‌సాబ్‌ పవన్‌కళ్యాణ్‌ విచ్చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా ఉండిపోవడంతో జనసైనికులు కొంత నిరుత్సాహానికి గురైయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని ప్రసంగించారు. ఆంధ్రరాష్ట్ర అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరిపాలనలో రూ 5.56లక్షల కోట్ల నిధులు అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా మరో రూ 3లక్షల కోట్ల నిధులను అధనంగా అందించారన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను దుర్వినియోగం చేసి అభివృద్ది అన్నది ఎక్కడా కనిపించకుండా చేశారని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రాభివృద్దికి పదేళ్లలో అందించాల్సిన వనరులను రెండేళ్లలోనే అందించి రాష్ట్రాభివృద్దికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతో తోడ్పాటు అందించారన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో చంద్రబాబునాయుడు, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలోని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రం అందించిన నిధులను దుర్వినియోగం చేశారని అన్నారు. రెండు సంవత్సరాలలోనే ఆంధ్రరాష్ట్రంలో తిరుపతిలో ఐఐటీ, వెస్ట్‌ గోదావరిలో నేషనల్‌ ఇన్స్‌ట్యూట్‌ఆఫ్‌ టెక్నాలజీ, విశాఖలో ఐఏఎన్‌, పున్నూరులో త్రిపుల్‌ ఐటీ, తిరుపతిలో జేఏఎస్‌ఆర్‌, అనంతపురంలో సెంట్రల్‌ ఇన్స్‌ట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మంగళగిరిలో ఎయిమ్స్‌ ఇవే కాకుండా జాతీయ రహదారుల అభివృద్ది, ఈ ప్రాంత ప్రజలు చిరకాలంగా ఎదురు చూస్తున్న శ్రీకాళహస్తి – నడికుడి రైల్వే అభ్యున్నతి కోసం రూ 450 కోట్లు నిధులు మంజూరు చేసి పనులు పూర్తి దశకు చేరుకున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరిగతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఆంధ్రరాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను నిజం చేసే విధంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన్‌ పథకం ద్వారా రూ 30వేల కోట్ల నిధులతో 20లక్షల ఇళ్లు మంజూరు చేశాన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా ఎన్నికల బరిలో నిలిచిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి కత్తి రత్నప్రభను మంచి మెజార్టీతో గెలిపిస్తే తిరుపతిని మరింతగా అభివృద్ది చేస్తామన్నారు. ఈ బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌, కేంద్ర మంత్రి మురళీధరన్‌, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, సునీల్‌ దియో దర్‌, మాజీ మంత్రులు ఆదినారాయణరెడ్డి, రావెల కిషోర్‌బాబు, సీఎం రమేష్‌, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరీ, యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్‌, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ తిరుపతి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహన్‌, పీఏసీ సభ్యుడు హరిప్రసాద్‌, జనసేన నాయకులు మనుక్రాంత్‌రెడ్డి, స్థానిక బీజేపీ, జనసేన నాయకులు సురేంద్రరెడ్డి, మాల్యాద్రినాయుడు, రంగినేని కృష్ణయ్య పాల్గొన్నారు.
బీజేపీ తీర్ధం పుచ్చుకున్న సినీనటి హేమ
సినీనటి హేమ నాయుడుపేట పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆధ్వర్యంలో భారతీయ జనతాపార్టీలో చేరారు. ఈ సందర్భంగా సినీనటి హేమకు బీజేపీ కండువాను కప్పి ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సినీనటి హేమ విచ్చేయడంతో కేరింతలు కొట్టి జై బీజేపీ.. జై జనసేన అంటూ నినాదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement