Wednesday, May 1, 2024

Balakrishna: జగన్ కుట్రతోనే చంద్రబాబు అరెస్ట్.. : బాలకృష్ణ

మంగళగిరి: జగన్‌ 16 నెలలు జైలులో ఉండి వచ్చారని, చంద్రబాబును 16 రోజులైనా జైలులో పెట్టాలని జగన్‌ కుట్ర చేస్తున్నారని.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలకృష్ణ మాట్లాడారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో అవినీతి జరిగిందని సృష్టించి తెదేపా అధినేత చంద్రబాబును అరెస్ట్‌ చేశారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేశారని అరోపించారు. సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్షసాధింపులే లక్ష్యంగా సీఎం జగన్‌ పనిచేస్తున్నారన్నారు. జగన్‌ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారు. వేలమంది యువతకు ఉపాధి కల్పించిన సంగతి మరిచారా ? హిందూపురంలో 1,200 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలి కదా ? ఛార్జిషీట్‌ ఎందుకు వేయలేదు ? ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారు. రాజకీయ కక్షసాధింపులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.

చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారు..
జగన్‌పై ఈడీ సహా అనేక కేసులున్నాయి.. బెయిల్‌పై బయట తిరుగుతున్నారు. ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ముందుగా గుజరాత్‌లో ప్రారంభించారు. సీఎం కేవలం పాలసీ మేకర్.. అధికారులే అమలు చేస్తారు. అజేయ కల్లం ప్రతిపాదిస్తే.. ప్రేమ్‌చంద్రారెడ్డి అమలు చేశారు. ప్రభుత్వం రూ.370 కోట్లు ఖర్చు చేసింది. 2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. డిజైన్‌ టెక్‌ సంస్థకు జగన్‌ ప్రభుత్వం అభినందన లేఖ ఇచ్చింది. జగన్‌.. ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చిందా ? చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారన్నారు. ఇలాంటివి ఎన్నో చూశాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు ఒక బ్రాండ్ అన్నారు. న్యాయ పోరాటం చేస్తాం. జగన్‌ ఉన్న సంస్థలను విధ్వంసం చేసి.. యువతను గంజాయికి బానిస చేశారన్నారు. జగన్‌ చేసే కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు గాలికబుర్లు చెబుతున్నారన్నారు. పీల్చే గాలిపై కూడా పన్నులు వేస్తారు. ప్రజలు అనుభవించింది చాలు.. మార్పుకోసం సైనికుల్లా పనిచేయాలన్నారు. మొరిగితే పట్టించుకోను.. అతిక్రమిస్తే ఉపేక్షించనన్నారు. రాష్ట్రం కోసం ప్రతిఒక్కరూ ఉద్యమించాల్సిన సమయమిదని అన్నారు. చంద్రబాబుకు సానుభూతి తెలిపిన ప్రతిఒక్కరినీ కలుస్తాం. నేనొస్తున్నా.. ఎవరూ భయపడాల్సిన పనిలేదని, తెలుగువాడి సత్తా, పౌరుషాన్ని చూపెడదామని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement